ఏపీ హైకోర్టుకు చేరిన వివేకా హత్య కేసు...ప్రతివాదులుగా 8 మందిని చేర్చిన జగన్
వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును స్వతంత్య్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలంటూ వైసీపీ అధినేత జగన్ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా ఏపీ సీఎం చంద్రబాబుతో సహా మొత్తం 8 మందిని చేర్చారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీ హైకోర్టుకు చేరింది. సిట్ విచారణతో నిజాలు వెల్లడయ్యే అవకాశం లేదంటూ వైసీపీ అధినేత జగన్ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసును స్వతంత్య్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని పిటిషన్లో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ పోలీసుల అజమాయిషీ లేని స్వచ్ఛంద దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని పిటిషన్లో కోరారు.
వివేకానందరెడ్డి హత్య కేసును సాధారణ విషయంగా చూపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేసును వ్యక్తిగత ప్రయోజనాలకోసం రాజకీయం చేస్తున్నారని పిటిషన్లో జగన్ పేర్కొన్నారు. ఈ పిటిషన్లో సీఎం చంద్రబాబుతో పాటు మరో 8 మందిని ప్రతివాదులుగా చేర్చారు. సీఎం చంద్రబాబుతో సహా ఏపీ డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కడప ఎస్పీ, సిట్ బృందం, పులివెందుల ఎస్ హెచ్ వో, సీబీఐ, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా పేర్కొన్నారు. సిట్ వల్ల వాస్తవాలు బయటకు వస్తాయనే నమ్మకం లేదని జగన్ తెలిపారు.
ఓ వైపు సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతుండగా కేసు హైకోర్టుకు చేరడం కీలక పరిణామంగా చెబుతున్నారు. ఇప్పటికే వివేకా అనుచరులు పలువురిని అదుపులోకి తీసుకున్న అధికారులు కీలక విషయాలు రాబట్టారు. అయితే సిట్ విచారణతో తేలేదేం అని చెప్పుకొచ్చిన జగన్ సీబీఐతో విచారణకు డిమాండ్ చేశారు. లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని గతంలోనే ప్రకటించారు.