నోటా ఓట్లు అభ్యర్థుల కొంప ముంచాయి. వేల సంఖ్యలో నోటాకు ఓట్లు పడ్డాయి. మెజారిటీకి మించి నోటాకు ఓట్లు పోలవడంతో అభ్యర్థుల గెలుపు ఓటములు తారుమారయ్యాయి. నోటా ఓట్లు తమకు పడి ఉంటే గెలిచే వారమని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు.
నోటా.. ఆ మాట ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఈవీఎంలలో దీనికి ఓ బటన్ ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే 'నోటా' బటన్ నొక్కాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో నోటాకు ఎక్కువ మంది ఓటు వేయడం గమనిస్తే అభ్యర్థులెవరూ నచ్చలేదన్న విషయం అర్ధమవుతోంది.
నోటా బటన్ నొక్కడం ద్వారా తమ ఓటు ఏ అభ్యర్థికీ చెందకుండా చేశారు. గత ఎన్నికల నుంచి నోటా ఒక్కోచోట పదో పాతికో దానికి వచ్చేవి. అయితే ఈ పర్యాయం మాత్రం వేలాది ఓట్లు నియోజకవర్గాల వారీగా పడిన విషయం పోలింగ్ సరళిని పరిశీలిస్తే అర్ధమవుతోంది. ప్రతి నియోజకవర్గంలో గరిష్టంగా వేలాది ఓట్లు నోటాకి దక్కాయంటే ఎక్కువగా యువ ఓటర్లు దీనికి వేసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.
తక్కువ ఓట్లతో ఓటమి పాలైన అభ్యర్థులు కనీసం నోటాకు పోలైన ఓట్లయినా తమకు పడితే విజయం వరించేదేదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఈవీఎంలలోనే కాకుండా ఇటు ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్లను అందజేశారు. పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకున్నవారు కూడా నోటాకు ఓటు వేసి ఏ అభ్యర్థి తమకు నచ్చలేదని స్పష్టం చేశారు.