తెలంగాణ కాంగ్రెస్ నిరసన బాట పట్టింది. అధికార టీఆర్ఎస్ పార్టీ సిఎల్పీ విలినం చేయడంతో హస్తం పార్టీ నిరసనకు దిగింది. ప్రగతి భవన్లో పార్టీ వీడిన ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీకావడంతో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీల్లో అధికార పార్టీ తీరును నిరసిస్తూ ఆందోళన చేసింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలు దగ్దం చేయాలని పార్టీ పిలుపునిచ్చింది.
సీఎల్పీ విలీనంపై టీ కాంగ్రెస్ సీరియస్ అయ్యింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, ఉత్తమ్, శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి అసెంబ్లీ ముందు దీక్షకు దిగారు. బ్లాక్ రిబ్బన్ ధరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదుట కూర్చుని నిరసన తెలిపారు. అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
ఇక టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సీఎల్పీ విలీన లేఖ అంశంపై కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పీకర్ కార్యాలయానికి ఫోన్ చేశారు. అయితే స్పీకర్ అందుబాటులో లేరని కార్యాలయ సిబ్బంది తెలిపింది. దీంతో స్పీకర్ తీరుపై ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ ఎందుకు రహస్యంగా కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమను కలవడానికి స్పీకర్ ఎందుకు సమయం ఇవ్వడం లేదని సీరియస్ అయ్యారు. హైకోర్టులో పిటీషన్ పెండింగ్లో ఉండగా విలీనంపై స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
అధికార పార్టీని తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు టీపీసీసీ పిలుపునిచ్చింది. ముఖ్యమంత్రి దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని కార్యకరలకు పార్టీ సూచించింది. ఓవైపు న్యాయపోరాటం చేస్తూ మరోవైపు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే యోచనలో ఉంది టీ కాంగ్రెస్ పార్టీ.