టీఆర్ఎస్లో ఎమ్మెల్సీ ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఈసారి ఎలాగైనా పదవి సంపాదించాలని పార్టీ ముఖ్యనేతల చుట్టూ తిరుగుతున్నారు. పదికి పైగా ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీల్లో మెజార్టీ సీట్లు అధికార పార్టీకే దక్కే అవకాశమే ఉండటంతో ఆశావాహులు తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణలో ఒక వైపు సర్పంచ్ ఎన్నికల హడావుడి నడుస్తుంటే. మరో వైపు శాసనమండలిలో పదవుల కోసం ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ టీఆర్ఎస్ నేతలందరూ ఎమ్మెల్సీ పదవులపై కన్నేశారు. ఏదో ఒక కోటాలో ఎమ్మెల్సీ పదవి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసేందుకు ఆశావాహులంతా తెలంగాణ భవన్ కు వస్తున్నారు.
మార్చ్ మొదటి వారంలో మొత్తం 13 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలోని హోమంత్రి మహమూద్ అలీ, మహ్మద్ సలీం, సంతోష్ కుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెస్ ప్రభాకర్, టీచర్ కోటాలో పాతూరి సుధాకర్ రెడ్డి, పూల రవీందర్, గ్రాడ్యువేట్ కోటాలో మండలి చైర్మన్ స్వామి గౌడ్ పదవీ కాలం మార్చ్తో ముగయనుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరిన కొండా మురళి తన పదవికి రాజీనామా చేశారు ఎమ్మెల్యేలుగా గెలిచిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతా రావుల రాజీనామాలు కూడా చైర్మన్ స్వామి గౌడ్ ఆమోదించారు.
ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అవుతున్న ఐదు స్థానాలూ టీఆర్ఎస్కు దక్కనున్నాయి టీచర్ కోటాలోని రెండు, స్థానిక సంస్థల కోటాలో రెండు, గ్రాడ్యేవేట్ కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో మెజార్టీ సీట్లు టీఆర్ఎస్ కైవసం చేసుకునేందుకు ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది. ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని గతంలో పలువురు నేతలకు ఇప్పటికే హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వాళంతా పదవుల కోసం ప్రగతి భవన్, తెలంగాణ భవన్ పెద్దలను కలుస్తున్నారు. హో మంత్రి మహముద్ అలీకి తప్పని సరిగా ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇక పదవీ కాలం ముగుస్తున్న ఎంఎస్ ప్రభాకర్ కు రెన్యువల్ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కౌన్సిల్ చైర్మన్ స్వామి గౌడ్ సీఎం కేసీఆర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. టీచర్స్ కోటాలోని పాతూరి సుధాకర్ రెడ్డి, పూల రవీందర్ లు మళ్ళీ టీచర్ కోటానుంచే పోటీ చేసేందుకు సన్నద్దం అవుతున్నారు.
ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న నేతలు ఇప్పటికే కేటీఆర్ను కలిసి తమకు పదవి ఇవ్వాలని విజ్నప్తి చేశారు. మొత్తానికి సామాజిక వర్గాలు, సీనియారిటీ, గతంలో తమకు హామీ ఇచ్చారు కాబట్టి తమకే పదవి వస్తుందని నేతలు ఆశిస్తున్నా.. సీఎం కేసీఆర్ మదిలో ఏముందనేది ఆసక్తిగా మారింది.