ఈవీఎంలకు వ్యతిరేకంగా టీడీపీ పోరుబాట పట్టబోతోంది. దేశవ్యాప్తంగా ఇతర పార్టీలతో కలసి ఈవీఎంలకు వ్యతిరేకంగా ఉద్యమించడంతో పాటు న్యాయ పోరాటం కూడా చేయాలని నిర్ణయించింది. అటు తెలంగాణ విపక్ష నేతలు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ మండి పడుతున్నాయి. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈవీఎంలపై చర్చ జరిగింది. ఈవీఎంలలో వంద శాతం హ్యాకింగ్కు అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈవీఎంల వినియోగాన్ని వ్యతిరేకించాలని ఎంపీలతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు.
ఈవీఎంలపై అనేక పార్టీల్లో వ్యతిరేకత ఉందన్న చంద్రబాబు ఎన్నికల కమిషన్ ఒక రిఫరీ మాత్రమేనని వ్యాఖ్యానించారు. వీవీప్యాట్ రశీదులు వంద శాతం లెక్కించేలా ఒత్తిడి చేయాలని లేదంటే బ్యాలెట్ విధానానికి వెళ్లాలని అన్నారు. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమౌతున్నా కేంద్రం స్పందించడం లేదన్నారు. ఈవీఎంలపై పోరాటానికి వ్యూహం రచిస్తున్నారని టీడీపీ ఎంపీలు తెలిపారు.
మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వీవీప్యాట్ రశీదులు లెక్కించడానికి ఎన్నికల కమిషన్ ఎందుకు వెనుకాడుతోందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై పోరాటం కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ ఓటర్ల జాబితాలో అవకతవకలపై క్షమాపణ కోరిన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఇప్పుడు ప్రతిపక్షాలను విమర్శించడం దారుణమన్నారు కాంగ్రెస్ నేత వీహెచ్. ఓటర్ల లిస్టులో అక్రమాలకు బాధ్యత వహించాల్సిన తెలంగాణ ఎన్నికల సంఘాన్ని ప్రముఖులు ప్రశంసించడమేంటని వీహెచ్ నిలదీశారు.