ఎపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటీకల్ హీట్ పెరుగుతోంది. మాటల తూటలతో ఎన్నికల వేడీ రెట్టింపు అవుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైయస్ వివేకా హత్యకేసులో వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాటకాలాడుతున్నారని నిప్పులు చెరిగారు. అసలు వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వకూడదని, సిట్ అధికారులు మాట్లాడకూడదని కోర్టులో వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిటిషన్ ఎందుకు వేయించారని ప్రశ్నించారు. కేసు దర్యాప్తు చేశాక నివేదిక ఇవ్వకుండా ఎలా ఉంటారని వర్ల రామయ్య అన్నారు. ఏ వాస్తవాలు బయటపడుతాయో అని భయపడి జగన్ మోహన్ రెడ్డి ఇలా పిటిషన్లు వేయిస్తున్నారని ఆరోపించారు. నివేదిక బయటకొస్తే ఇంటి దొంగల పేర్లు బయటపడుతుందని, దాంతో ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి ఇబ్బంది అవుతుందనే ఇలా నాటకాలాడుతున్నారని అన్నారు.