విశాఖ తీరాన వెలసిన విగ్రహాలు వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా పొలిటికల్ పెద్దలే స్వయంగా విగ్రహాలు నెలకొల్పడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. అనుమతి లేకుండా ఏర్పాటైన విగ్రహాల విషయంలో కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. సాగరతీరంలో స్ట్యాచ్యూ స్ట్రగుల్పై స్పెషల్ రిపోర్ట్.
మహోన్నతమైన వ్యక్తులను స్మరించుకోవడం..
వారి స్ఫూర్తి భావితరాలకు అందజేయడం..
వారి బాటలో నడవాలని గుర్తు చేయడం..
విగ్రహాల ఏర్పాటుకు ఇలాంటి ముఖ్యకారణాలు చాలానే ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో ఎవరి ఇష్టానుసారం వారు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా అనుమతి లేకుండా విశాఖ తీరంలో వెలిసిన విగ్రహాలు వివాదాస్పదం అవుతున్నాయి. గతేడాది చివరలో సాగర తీరాన రాత్రికి రాత్రే మూడు విగ్రహాలు వెలిశాయి. సినీ పరిశ్రమలో దిగ్గజాలుగా పేరొందిన అక్కినేని నాగేశ్వర్రావ్, దాసరి నారాయణరావుతో పాటు నందమూరి హరికృష్ణ విగ్రహాలను నెలకొల్పారు. అనుమతి తీసుకోకుండానే విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రారంభించారు.
అయితే పబ్లిక్ ప్లేస్లో విగ్రహాలు ఏర్పాటు చేయాలంటే జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమీటీ అనుమతి తప్పనసరి వుండాలి. కాని బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన విగ్రహాలకు నిర్వహాకులు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఇండియన్ కల్చరల్ సెంటర్ డైరెక్టర్ ప్రో. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అధ్వర్యంలో మంత్రి గంటా శ్రీనివాస్రావుతో పాటు పలువురు ప్రముఖులు విగ్రహాలను ఏర్పాటు చేశారు. దీనిపై అప్పట్లోనే స్పందించిన మున్సిపల్ కమిషనర్ విగ్రహాలను తొలగించాలని ఆదేశించారు. కానీ విషయం రాజకీయ రంగు పులుముకోవడంతో విగ్రహాలు మాత్రం కదల్లేదు.
అయితే అనుమతి లేకుండా ఏర్పాటైన విగ్రహాలను తొలగించాలంటూ విశాఖకు చెందిన పర్యావరణవేత్త బోలిశెట్టి సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ వేసారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ యాక్ట్ 1955 ప్రకారం 401, 406, 461 సెక్షన్లు అనుసరించి అనధికారికంగా విగ్రహాలను ఏర్పాటు చేయడం చట్టవిరుద్దమంటూ పిటీషనర్ పేర్కోనడంతో విచారించిన ధర్మాసనం మంత్రి గంటా శ్రీనివాసరావు, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తో పాటు జీవీఎంసీ కమీషనర్ హరినారయణకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.
అయితే విగ్రహాల ఏర్పాటు విషయంలో.. జీవీఎంసీ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారనే ఆరోపణలు వచ్చాయి. కానీ సాధారణ జనం మాత్రం విగ్రహాలపై జరుగుతున్న రగడపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాగరతీరంలో నెలకొన్న ఈ విగ్రహాల వివాదం ఎక్కడకు దారి తీస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.