డేటా చోరీ కేసు విచారణకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. సిట్ చీఫ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో 9మంది అధికారుల బృందం సమావేశమైంది. డీజీపీ కార్యాలయంలో సమావేశమైన సిట్ కార్యాచరణపై చర్చించింది. ఈ కేసులో ఇప్పటికే సేకరించిన వివరాలను, ఆధారాలను సైబరాబాద్ పోలీసులు సిట్కి అందజేశారు.
డేటా చోరీ ఐటీ గ్రిల్స్ కేసు దర్యాప్తు కోసం టీమ్ను మూడు బృందాలుగా విడగొట్టేందుకు సిట్ చీఫ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర నిర్ణయించారు. ప్రధానంగా ఈ కేసులో డేటా ఎక్కడికి వెళ్లింది? దాన్ని ఎలా రికవరీ చేయాలన్న దానిపై ఒక బృందం దర్యాప్తు చేయనుంది. అలాగే మరో బృందం ప్రధాన నిందితుడు అశోక్ పట్టుకునేందుకు గాలింపు చేపట్టనున్నారు. ఇక మూడో టీమ్ అనుమానితులు, సాక్షులను విచారించనుంది. మరోవైపు డేటా కోసం అమెజాన్, గూగుల్ సంస్థలకు సిట్ లేఖలు రాసింది.
డేటా చోరీ కేసులో కీలక ఆధారాలు సేకరించేందుకు సిట్ సిద్ధమైంది. త్వరలోనే ఐటీ గ్రిడ్స్ కంపెనీ ఉద్యోగులను సిట్ అధకారులు విచారించనున్నారు. అలాగే ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వ డేటా రావడం వెనుక ఏపీ అధికారుల పాత్ర ఏమైనా ఉందేమోనన్న అనుమానాలపై దర్యాప్తు చేయనున్నారు. ఇక ఈ కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా ఈరోజే వచ్చే అవకాశం కనిపిస్తోంది.