తెలంగాణ లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. మరో నాయకుడు హస్తానికి గుడ్ బై చెప్పేశారు. కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు. ఆయన ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుధాకర్ రెడ్డి రాజీనామా లేఖ పంపించారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు బీజేపీ తీర్థంపుచ్చుకున్న విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్ పార్టీ నేతలు వరుస పెట్టి వలసల బాట పడుతుండటంతో కాంగ్రెస్ అతలకుతలం అవుతోంది.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో ఘోర ఓటమికి రాష్ట్ర నాయకత్వమే నైతిక బాధ్యత వహించాలని ఏఐసీసీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యాలు చేసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్టానంపై పొంగులేటి సుధాకర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు మొండి చేయి ఎదురు కావడంతో పాటు, కాంగ్రెస్లో తగిన గుర్తింపు లేకుండా పోయిందంటూ వాపోతున్నారు. మొన్నటి వరుకు పొంగులేటి సుధాకర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. ఎట్టకేలకు పొంగులేటి కమలం గూటికి చేరనున్నట్లు సమాచారం.