బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో పలు కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆమె ప్రాణాలు తీసుకునే ముందు సూర్యతో గొడవపడ్డట్లు పోలీసులు గుర్తించారు. ఆమెకు సంబంధించిన సెల్ ఫోన్ను ఓపెన్ చేసిన పంజాగుట్ట పోలీసులు సూర్యతో చాటింగ్ డాటాను రికవరీ చేశారు. గత మూడు నెలలుగా వారిద్దరి మధ్య గొడవ జరుగుతున్నట్లు చాటింగ్ ద్వారా తెలుసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఝాన్సీ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో జీర్ణించుకోలేకపోయిన సూర్య ఆమెను వేధించడం మొదలుపెట్టాడని ఆ వేధింపులు తట్టుకోలేక నెల రోజుల ముందు కూడా ఝాన్సీ సూసైడ్ అటెంప్ట్ చేసిందని పోలీసులు వివరించారు. ప్రస్తుతం ఆత్మహత్య చేసుకునే ముందు రోజు కూడా సూర్యకు 14 మెస్సేజీలు పంపిందని అయితే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ఇటు ఝాన్సీకి సంబంధించిన రెండో ఐ ఫోన్ లాక్ తెరుచుకోలేదని పోలీసులు వెల్లడించారు. దాని ద్వారా మరింత సమాచారం వెలుగుచూసే అవకాశం ఉందని చెబుతున్నారు.