ఫోని తుపాను తీవ్రతపై ప్రధాని మోడీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావం ఒడిశాపై తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. తుపాను ప్రభావం ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని మోడీ ప్రకటించారు. తుపాను గమనంపై ఐఎండీ డైరెక్టర్ జనరల్ మోడీకి వివరించారు. దీంతో పాటు సహాయక చర్యలపై కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందం మోడీకి తెలియచేశారు. తుఫాను ప్రభావిత రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాలని ప్రధానమంత్రి అధికారులకు సూచించారు. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో అవసరమైన అన్ని సహాయ పునరావాస చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.