రాజన్న రాజ్యం కోసం జగనన్నకు పట్టం

Update: 2019-05-23 04:54 GMT

ఒక్క ఛాన్స్.. ఒక్క అవకాశం.. ఇదే వైసీపీ విజయానికి బాటలు వేసింది. ఒక్క అవకాశం ఇవ్వండి రాజన్న రాజ్యం తెస్తామని వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలను ప్రజలు నమ్మారు. ప్రస్తుత ఓటింగ్ సరళి చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ప్రజలు ఓట్ల రూపంలో జగన్ మాటలకు పూలు చల్లి స్వాగాతిస్తున్నారని చెప్పొచ్చు. రాజన్న రాజ్యం అన్న మాట జనం మనసుల్లోకి దూసుకుపోయింది. ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న గోదారిలా ఓట్లు వెల్లువెత్తాయి. పలు నియోజకవర్గాల్లో ఐదు నుంచి ఆరు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. మొత్తం 175 నియోజకవర్గాలున్న ఏపీలో 162 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ వెలువడుతుండగా, వైసీపీ 133 స్థానాల్లో ఆధిక్యంలో ఉండి, తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుండగా, తెలుగుదేశం పార్టీ కేవలం 29 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. జనసేన, కాంగ్రెస్ సహా మరే ఇతర పార్టీ ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం. పవన్ కల్యాణ్ భీమవరంలో మూడో స్థానంలో, గాజువాకలో రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో వైసీపీ పలు జిల్లాలను క్లీన్ స్వీప్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. నెల్లూరు, కడప, విజయనగరం, తూర్పు గోదావరి తదితర జిల్లాల్లోని అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళుతున్నారు. అధికార మార్పిడిని ప్రజలు స్పష్టంగా కోరుకున్నారని ఈ ఎన్నికల ఫలితాల సరళి తెలియ చేస్తోంది. వైసీపీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.

 


Similar News