లగడపాటి లీక్ చేసిన ఎగ్జిట్ పోల్స్ టీజర్...ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో...
లోక్సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీ అసెంబ్లీ ఫలితాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు సైకిల్ ఎక్కడానికే మొగ్గు చూపుతున్నారని తెలంగాణ ప్రజలు కారు వైపు చూస్తున్నారని చెప్పారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేది 24 గంటల్లో వెల్లడిస్తానన్నారు. మరోవైపు తనకు ఏ పార్టీతో సంబంధం లేదన్న లగడపాటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తన అంచనాలు తప్పడానికి కారణాలు కూడా వివరిస్తానని చెప్పారు.
ఆంధ్రా ఆక్టోపస్గా పేరున్న విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రేపు, రేపు అంటూనే ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పకనే చెప్పారు. అయితే, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేది 24 గంటల్లో వెల్లడిస్తాన్నారు లగడపాటి.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరకున్నా ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని పేర్కొన్న లగడపాటి రాష్ట్రం లోటు బడ్జెట్తో సతమతమవుతున్న నేపథ్యంలో సైకిల్ ఎక్కడానికే మొగ్గు చూపుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ మిగులు రాష్ట్రం అయినందున అక్కడి ప్రజలు కారు ఎక్కడానికి ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తన అంచనాలు తప్పడానికి కారణాలు కూడా వివరిస్తానని చెప్పిన లగడపాటి తనకు ఏ పార్టీతో సంబంధం లేదని పదే పదే చెప్పుకొచ్చారు.
ఏపీలో 90 శాతానికి పైగా ప్రజలు మూడు పార్టీలకే ఓటు వేశారని లగడపాటి చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని జోస్యం చెప్పారు. అయితే ప్రభుత్వ ఏర్పాటులో పవన్ కీలకమయ్యే అవకాశం ఉందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్న వేయగా మెగాస్టార్ చిన్న తమ్ముడైన పవన్ కళ్యాణ్ ఆయన కంటే తక్కువ సీట్లే తెచ్చుకోబోతున్నారంటూ వ్యాఖ్యానించారు.
అయితే, ఏపీలో హంగ్ వచ్చే పరిస్థితి ఏమాత్రం లేదన్న లగడపాటి గెలిచే పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందన్నారు. ఏపీ ప్రజలు ఎప్పుడూ ఇలాంటి తీర్పే ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజల నాఢీ తెలిసిన వ్యక్తిగా ఈ మాట చెబుతున్నానన్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత తిరుపతిలో తాను చేసిన సర్వే పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కేంద్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెబుతానన్నారు లగడపాటి. మొత్తంమీద లగడపాటి రాజగోపాల్ లీక్ చేసిన ఎగ్జిట్ పోల్స్ టీజర్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. మరి తిరుపతి వేదికగా ఏం చెబుతారో చూడాలి.