మమత మెగా షో...చంద్రబాబు ఎలాంటి ప్రసంగం చేస్తారనే దానిపై ఆసక్తి

దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే లక్ష్యంతో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని చేపట్టనున్న ర్యాలీలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు.

Update: 2019-01-19 03:32 GMT
Mamata Banerjee

దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే లక్ష్యంతో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని చేపట్టనున్న ర్యాలీలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. ఇప్పటికే పార్టీకి చెందిన సీనియర్ నేతలతో కలిసి కోల్‌కతా చేరుకున్న ఆయన బీజేపీ ఓటమే లక్ష్యంగా వివిధ పార్టీలను ఏకం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు.

కేంద్రంలో బీజేపీ తీరును నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప‌్రభుత్వం చేపట్టిన నిరసన ర్యాలీకి దేశంలోని 22 పార్టీలు మద్దతు పలికాయి. ఇందులో కాంగ్రెస్‌తో పాటు ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే, టీడీపీ లాంటి పార్టీలు ఉన్నాయి. ర్యాలీలో పాల్గొనేందుకు రావాలంటూ సీఎం మమతా బెనర్జే వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలకు ఫోన్ చేసి స్వయంగా ఆహ్వానించారు. ముందస్తుగా ప్రకటించినట్టుగానే టీడీపీ, ఎస్పీలు నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే పార్టీ నేతలతో కలసి కోల్‌కటా చేరుకున్నారు. డీఎంకే అధినేత స్టాలిన్ కూడా సభకు హాజరవుతున్నప్పటికీ చంద్రబాబే ఆ సభలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ర్యాలీ అనంతరం చంద్రబాబు ఎలాంటి ప్రసంగం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

మమత ర్యాలీకి చంద్రబాబు హాజరయ్యే అంశంపై పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చలు జరిపారు. కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలకు చెందిన అగ్రనేతలు కాకుండా వారి ప్రతినిధులను పంపుతున్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. అయితే తొలి నుంచి బీజేపీ ప్రభుత్వం మమతా బెనర్జీ పోరాడుతున్నందున అన్ని విధాలు మద్దతు ఇవ్వాలని పలువురు చంద్రబాబును కోరారు. ఏపీలో సీబీఐకి అనుమతిని రద్దు చేసిన వెంటనే కోల్ కతాలో కూడా మమత ప్రభుత్వం ఇటువంటి నిర్ణయమే తీసుకోవడం ద్వారా భావసారూప్యత చాటుకున్నారని ఇలాంటి సమయంలో నిరసన ర్యాలీలో పాల్గొనడం ద్వారా జాతీయ స్ధాయి గుర్తింపుతో పాటు మరిన్ని ప్రాంతీయ పార్టీలకు ఏకం చేయవచ్చంటూ బాబుకు సూచించారు. దీంతో నిరసన ర్యాలీలో పాల్గొనాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

మమతా బెనర్జీ నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో కాంగ్రెస్ తరపున మల్లికార్జున ఖర్గే, జేడీఎస్ నుంచి దేవె గౌడ, కుమారస్వామి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎస్పీపీ నేత శరద్ పవార్, ఆర్జేడీ తరపున తేజస్వీ యాదవ్, పాటిదార్ ఉద్యమకారుడు హార్డిక్ పటేల్ హాజరుకానున్నారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రతినిధిగా సతీష్ చంద్ర మిశ్రా ఈ ర్యాలీకి హాజరవుతారు. ఇక బీజేపీకి దూరంగా ఉంటున్న యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, శత్రుఘ్న సిన్హా వంటి నేతలు కూడా హజరయ్యే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో మోదీ ప్రభుత్వం తీవ్రంగా విభేదిస్తున్న ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, అజిత సింగ్, శరద్ యాదవ్‌లు కూడా ర్యాలీలో పాల్గొనున్నారు.

లోక్ సభ ఎన్నికలకు ముందే బీజేపీ వ్యతిరేక శక్తుల ఐక్యతను చాటడమే లక్ష్యంగా మమతా బెనర్జీ వ్యూహాత్మకంగా ఈ అడుగులు వేస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మూడు రాష్ట్రాల్లో ఎన్నికల ఓటమి, రాఫెల్ డీల్‌, దేశం విడిచి వెళుతున్న రుణ ఎగవేతదారులు, నోట్ల రద్దు అంశాలను ఈ ర్యాలీలో ప్రస్తావించడం ద్వారా బీజేపీకి సవాళ్లు విసరాలని మమతా బెనర్జీతో పాటు చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.  

Similar News