స్థానిక సంస్థలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా టీఆర్ఎస్ సరికొత్త వ్యూహాన్ని అమలు పరుస్తోంది. ఇందుకు సంబంధించి పార్టీకి చెందిన ముఖ్యులతో ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. గెలిపించాల్సిన బాధ్యత మంత్రులపై పెట్టిన కేసీఆర్ ఇద్దరు జడ్పీ ఛైర్మెన్ అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించారు. మఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో సుమారు 3 గంటల పాటు టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. జడ్పీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనే ప్రధానంగా చర్చించారు. 32 జడ్పీటీసీలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సమర్థులను అభ్యర్థులుగా పోటీకి దించాలని గెలిపించాల్సిన బాధ్యత మంత్రులదే అని కేసీఆర్ తేల్చిచెప్పారు. ఈ ఎన్నికల కోసం 32 జిల్లాలకు కో ఆర్డినేటర్స్ను నియమించారు.
ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేకు జడ్పీ ఛైర్మన్ పదవులను ప్రకటించారు కేసీఆర్. ఆసిఫాబాద్ జడ్పీ చైర్మెన్ అభ్యర్థిగా కోవా లక్ష్మిని, అలాగే పెద్దపల్లి జడ్పీ ఛైర్మెన్ అభ్యర్థిగా పుట్టా మధు పేరును కేసీఆర్ ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని సమావేశంలో ప్రకటించిన కేసీఆర్ గ్రామస్థాయిలో పార్టీని వందశాతం బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. త్వరలో తీసుకువస్తున్న కొత్త చట్టాలపై సమావేశంలో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. రెవెన్యూ, మున్సిపల్ కొత్త చట్టాలపై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించారు. రెవెన్యూ శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తున్నామని దీనిపై రెవెన్యూ ఉద్యోగులు ధర్నాలు చేసినా పట్టించుకోవద్దని స్పష్టం చేశారు. అలాగే జీహెచ్ఎంసీ లో కూడా ప్రత్యేక చట్టం తెస్తున్నట్లు చెప్పిన కేసీఆర్ పాలనలో పూర్తిస్థాయి సంస్కరణలు తీసుకొస్తామన్నారు. ప్రజలంతా మనవైపే ఉన్నారన్న కేసీఆర్ ప్రభుత్వంపై చాలా ఆశలు పెట్టుకున్నారని అన్నారు. అందుకు అనుగుణంగానే పాలన ఉంటుందని స్పష్టం చేశారు.