మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖారారు అయ్యిందన్న వార్తలతో తెలంగాణలో పొలిటికల్ వేడి రగిలింది. పంచాగంతో పాటు సంఖ్యాశాస్త్రాన్ని ఫాలో అయ్యే కేసీఆర్ ఈ ఆదివారాన్నే ముహూర్తంగా ఎంచుకున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే కొత్త కేబినెట్లో కొత్త ముఖాలే ఉండనున్నాయా? కేసీఆర్ టీంలో ఎవరెవరికి చోటు దక్కుతుంది ఏ శాఖ ఎవరిని వరిస్తుంది ? అనే దాని చుట్టే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి.
తెలంగాణలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఈ నెల చివరివారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి. సభలో బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే ఆర్ధిక మంత్రి తప్పని సరి. ప్రస్తుతం తెలంగాణ క్యాబినేట్ లో కేసీఆర్తో పాటూ హోం మత్రి మహమూద్ అలీ మాత్రమే ఉన్నారు. ఉభయసభల్లో ఒకేసారి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపద్యంలో శాసన మండలిలో ఎమ్మెల్సీ గా ఉన్న మహమూద్ అలి ప్రవేశపెట్టినా శాసన సభలో ఎవరు బడ్జెట్ ప్రసంగం చదువుతారు అనేదానిపై సర్వత్రా అసక్తి నెలకొంది.
ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెడతారా లేక ఈ లోపు క్యాబినేట్ విస్తరణ చేపట్టి ఆర్థిక శాఖకు మంత్రిని కేటాయిస్తారా అన్న చర్చ ఇప్పటివరకు పార్టీలో జరుగుతుంది. అయితే ప్రగతి భవన్ వేదికగా జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తుంటే క్యాబినేట్ విస్తరణకు ముహూర్తం కుదిరినట్లే కనపడుతోంది. వచ్చే వారంలో పూర్తిస్థాయి క్యాబినేట్ కాకుండా 6నుంచి 8మందికి అవకాశం ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్టు కారు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ముహూర్తాలు, సంఖ్యాశాస్త్రాన్ని బలంగా నమ్మే కేసీఆర్ ఆదివారం వసంత పంచమి తిధి మాఘమాసం ను శుభముహూర్తం ను ఎన్నుకున్నారని ఆరోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రమాణస్వీకారం చేయించే అవకాశాలున్నట్లు సమాచారం.
వారం నుంచి సిఎం కేసీఆర్ ప్రగతిభవన్లో పాలనాపరమైన అంశాలపై రివ్యూలు నిర్వహిస్తునే పార్టీ నేతలతోనూ చర్చలు జరుపుతున్నారు. కొంతమంది సీనియర్ నేతలు, మాజీ మంత్రులను ప్రగతిభవన్కు కేసీఆర్ స్వయంగా పిలిచి మంతనాలు జరపడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిని ప్రగతిభవన్ కు పిలిచిన కెసీఆర్ వారితో గంటల తరబడి చర్చించినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణకు కసరత్తు జరుగతున్న సమయంలో వీరిని పిలిపించుకొని మాట్లాడటం ఆసక్తిగా మారింది. వారితో ఏం మాట్లాడారనే విషయం అత్యంత గోప్యంగా ఉంచడంతో మిగిలిన నేతల్లో టెన్షన్ మొదలైంది. అయితే మొత్తంగా సీనియర్లను పక్కన పెట్టకుండా పరిపాలనలో దక్షత చూపించిన కొంత మంది సీనియర్లను తీసుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రాజెక్ట్ లపై జరిగిన రివ్యూలో మాజీ మంత్రులుగా ఉన్న ఈటెల, జగదీష్ రెడ్డి లు సైతం పాల్గొన్నారు. మరో మాజీ మంత్రి తలసానికి సైతం మరోసారి కేసీఆర్ అవకాశం ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
గత కేబినెట్లో సీనియర్లకు పెద్దపీట వేసిన కేసీఆర్ ఈ సారి కొత్త ముఖాలకు చోటివ్వాలని భావిస్తున్నారట. ఇప్పటికే వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పట్నం నరేందర్ రెడ్డి, రెడ్యానాయక్, పువ్వాడ అజయ్, రేఖానాయక్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరో వైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులకు మాత్రం తొలి విడుతలో అవకాశం ఇచ్చేలా కనపించడం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్ధానాలే టార్గెట్గా వీరిద్దరికి ప్రధాన బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ఎన్నికల అనంతరం వీరిద్దరికి మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ ఊహగానాల్లోనే ఉండటం అధికారికంగా ఎలాంటి ప్రకటనలు రాకపోవడంతో పార్టీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ రేగుతోంది.