ఐపీఎస్ అధికారిగా ఎన్నో ప్రతిష్టాత్మక కేసుల్ని విచారించిన వ్యక్తిగా తెలుగు రాష్ట్రాల్లో జేడీ లక్ష్మీనారాయణ మంచి పేరుంది. కొంత కాలం క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ప్రజా సేవ చేయాలనుకున్నారు. అందు భాగంగా ఆయన అడుగులు ఏ పార్టీవైపు పడతాయనేది ఇన్నాళ్లు స్పష్టత రాలేదు. ఇప్పుడా ప్రశ్నకు తెరపదించుతూ జనసేన పార్టీలో చేరారు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ.
పవన్ కల్యాణ్ ఆహ్వానం మేరకు జనసేనలో చేరి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు జేడీ లక్ష్మీనారాయణ. ఈ క్రమంలో జేడీ ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే విశాఖపట్నం నుంచి జనసేన తరుపున పార్లమెంటుకు లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ అది కుదరకపోతే కాకినాడ పార్లమెంటు నుంచి పోటీ చేస్తారని జేడీ సన్నిహితులు తెలిపారు. ఇదిలా ఉంటే రాయలసీమ ప్రాంతం నుంచి పోటీ చేయాలని పవన్ కోరారు. దీంతో జేడీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. పార్టీ తరఫున ప్రచార బాధ్యతలు కూడా ఆయన చేపట్టనున్నారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున పవన్కు తోడుగా ప్రచారం నిర్వహించనున్నారు.