టీడీపీ పార్టీకి సాంకేతిక సేవలందిస్తున్న మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై నమోదైన కేసు దర్యాప్తులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ సంస్థ వద్ద ఏపీలోని ఓటర్ల ఫొటోలతో కూడిన జాబితా, ఆధార్, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలు అక్రమంగా ఉన్నాయంటూ కేపీహెచ్బీ ఇందు ఫార్చ్యూన్ ఫీల్డ్స్లో ఉండే డేటా అనలిస్ట్ తుమ్మ లోకేశ్వర్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశంలో ఆ సంస్థ ఉద్యోగుల కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. అయితే ఫిర్యాదు మేరకు దర్యప్తు చేపట్టిన పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్థ ఏపీ ప్రజల వ్యక్తిగత, సునిశిత సమాచారాన్ని భద్రపరిచినట్లు గుర్తించమని వెల్లడించారు. కాగా దీనికి సంబంధించి నలుగురు ఉద్యోగులను కూడా దాదాపు రెండ్రోజులపాటు విచారించామని తెలిపారు. సంస్థకు చెందిన ఉద్యోగులు విక్రమ్ గౌడ్, చంద్ర శేఖర్, ఫణి కుమార్, భాస్కర్ల సమక్షంలోనే ఆదారాలు సేకరించామని తెలిపారు. కాగా ఐటీగ్రిడ్ కార్యాలయంలో ల్యాప్టాప్, హార్డ్డిస్క్లు పత్రాలు జప్తు చేశామని వెల్లడించారు. కేసులో మరింత సమాచారం కోసం ఆధార్ సంస్థ, ఈసీకి లేఖ రాశాం. ఓట్ల తొలగింపుపై ఏపీలో 50 కేసుల వరకు నమోదయ్యాయని తెలిపారు. ఈ సంస్థ టీడీపీకి సంబంధించిన సేవామిత్ర యాప్ను నిర్వహిస్తోందని తెలిపారు. కాగా ఐటీగ్రిడ్ కేసులో అశోక్ను ప్రధాన నిందితుడిగా గుర్తించాం. వెంటనే అశోక్ లొంగిపోవాలని కోరుతున్నట్లు తెలిపారు. చట్టం ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.