స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ ఓట్లను లెక్కిస్తున్నారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమైంది. 10 గంటల్లోగా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి రాజేంద్రనగర్ వెటర్నరీ కాలేజీలో లెక్కిస్తున్నారు. అలాగే వరంగల్ జిల్లాకు సంబంధించి ఎనుమాముల మార్కెట్ యార్డులో నల్గొండ జిల్లాకు సంబంధించి దుప్పలపల్లి ఎన్ డబ్ల్యూసీ గోడౌన్లో కౌంటింగ్ జరుపుతున్నారు. మరో గంటా, గంటన్నరలోగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మే 31 న మూడు ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎన్నికలు జరిగాయి.
మూడు స్థానాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోటీ పడ్డాయి. మొత్తం 2 వేల 779 ఓట్లకు గాను.. 98 శాతం ఓటింగ్ నమోదైంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి టీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి మహేందర్రెడ్డి, కాంగ్రెస్ నుంచి కొమ్మూరి ప్రతాప్రెడ్డి బరిలో నిలిచారు. వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా ఇనుగాల వెంకట్రామిరెడ్డి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డి, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి లక్ష్మి పోటీ చేశారు. మూడు జిల్లాల్లో అధికార టీఆర్ఎస్కు మెజార్టీ ఉన్నా కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురైనట్లు తెలుస్తోంది. అయినా విజయంపై టీఆర్ఎస్ ధీమాగా ఉంది.