దేశంలో 2030 నాటికి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభించేలా మేనిఫెస్టోను రూపొందించామని చెప్పారు. కొత్త మార్గదర్శకంలో కాంగ్రెస్ పార్టీ విజన్ను ఆవిష్కరించామని చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశామని తెలిపారు. దీన్ని గదిలో కూర్చుని రూపొందించలేదని, ప్రజల మనసులో ఆలోచన ప్రతిబింబించేలా రూపకల్పన చేశామని రాహుల్ చెప్పారు. ముఖ్యంగా ఐదు అంశాలపై దృష్టి సారించామని వివరించారు.
మేనిఫెస్టోలో ప్రధానంగా ఐదు అంశాలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. 2030 నాటికి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకొని ఏడాదికి 72 వేలు పేదల ఖాతాల్లో జమ చేస్తామని రాహుల్ ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 22 లక్షల ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామన్న రాహుల్. పంచాయతీల్లో 10 లక్షల ఉద్యోగాలను పూరిస్తామన్నారు. గ్రామీణ ఉపాధి హామీని పటిష్టం చేసేందుకు ఇప్పుడున్న పని దినాలను వంద నుంచి 150కి పెంచుతామని హామీ ఇచ్చారు. రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ను తీసుకొస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించారు. రుణాలు చెల్లించలేని రైతులపై పెట్టే కేసులను క్రిమినల్ కేసులుగా పరిగణించమని రాహుల్ స్పష్టం చేశారు. విద్యపై జీడీపీలో 6 శాతం ఖర్చు చేస్తామన్న రాహుల్ జాతీయ, అంతర్గత భద్రతకు పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు.