లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న గులాబీ పార్టీకి టికెట్లు దక్కని సిట్టింగుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలంతా సైలెన్స్ మెయింటైన్ చేస్తుంటే ఆయా లీడర్ల అనుచరులు, కేడర్ కూడా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ అభ్యర్ధులకు షాకిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని గుర్తించిన గులాబీ బాస్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారట.
16 లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్తోన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముగ్గురు సిట్టింగులను పక్కనబెట్టడమే కాకుండా తొమ్మిది మంది కొత్త వాళ్లకు టికెట్లు ఇచ్చారు. అయితే కచ్చితంగా గెలిచి రావాలంటూ లక్ష్యాన్ని నిర్దేశించారు. కానీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అభ్యర్ధుల విజయానికి ఎంతవరకు సహకరిస్తారనేది పార్టీలో చర్చనీయాంశమైంది.
టికెట్ దక్కని సిట్టింగుల్లో మహబూబ్నగర్ ఎంపీ జితేందర్రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్, అలాగే ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. అలాగే పెద్దపల్లి టికెట్ ఆశించి భంగపడ్డ వివేక్ ఏకంగా టీఆర్ఎస్కే గుడ్బై చెప్పేశారు. దాంతో ఈ నాలుగు స్థానాల్లో టీఆర్ఎస్ కొంచెం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటుందనే మాట వినిపిస్తోంది.
టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు, మళ్లీ టికెట్ దక్కని సిట్టింగ్ ఎంపీల కేడర్ ప్రస్తుతం కామ్గా ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవడానికి గులాబీ బాస్ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అంటున్నారు.