కేంద్రం ఇచ్చిన నిధులు గురించి లెక్కలు అడుగుతున్న ప్రధాని మోడీ...ఏపీ ప్రజలు కట్టిన పన్నులకు కూడా లెక్కలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. చట్టాన్ని అమలు చేయమని అడిగినందుకే టీడీపీ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ధర్మపోరాట దీక్షలో ఆరోపించారు. గోద్రా ఘటన సమయంలోనూ మోడీ ధర్మాన్ని పాటించలేదనే విషయాన్ని నాటి ప్రధాని వాజ్పేయి అసంతృప్తి వ్యక్తం చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. పాలకులు ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. అందర్నీ సమానంగా చూడాల్సిన పాలకులు వివక్ష చూపిస్తే న్యాయం కోసం పోరాడాల్సిన అవసరం ఉదన్నారు. విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన విభజన హామీల అమలు కోసమే ధర్మపోరాట దీక్ష చేస్తున్నామని చంద్రబాబు అన్నారు.