తెలుగు రాష్ట్రాల్లో జరిగే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రాలప్రజలు నరేంద్ర మోడీకే ఓటు వేస్తారని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో దేశం కోసం మోడీ, మోదీ కోసం దేశం అనే భావం ఉందన్నారు దత్తాత్రేయ. ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ఓడిపోతామనే భయం పట్టుకుందన్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమితో పాటు, ఎల్బీనగర్ ప్రచారసభ జనం లేకపోవడం టీఆర్ఎస్ పార్టీకి అపశకునాలేనన్నారు.
ఆదివారం ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడారు. బీజేపీ మూడొందలకు పైగా స్థానాలు గెలుచుకుని కేంద్రంలో మోదీ ప్రభుత్వం మళ్లీ వస్తుందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ దుకాణం త్వరలోనే బంద్ అవుతుందన్నారు. సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో చాలా సర్జికల్ స్రైక్స్ జరిగాయని, కానీ ఎప్పుడైనా చెప్పుకున్నామా అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు దత్తాత్రేయ కౌంటర్ ఇచ్చారు. అసలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సర్జికల్ దాడుల గురించి ఏం తెలుసని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు.