గుప్త నిధుల కోసం వెళ్లి మృత్యువాత..అసలు అడవిలో ఏం జరిగింది..?

Update: 2019-05-17 09:28 GMT

గుప్త నిధులపై ఉన్న వ్యామోహం ఒకరి ఆయువు తీయగా మరొకరు అడవిలో అదృశ్యమయ్యారు. బతుకు జీవుడా అంటూ ఇంకో వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అసలు అడవిలో ఏం జరిగింది..? మూడో వ్యక్తి చెబుతున్నట్టు నిజంగానే వారిద్దరు దారి తప్పారా..? గుప్త నిధుల అన్వేషణ కోసం అడవిలోకి వెళ్లినవారు ఆ నాలుగు రోజులు ఎక్కడ ఉన్నారు..?

గుప్త నిధుల కోసం అడవిలోకి వెళ్లి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రకాశం జిల్లా తాడివారిపల్లి అటవీప్రాంతంలో చోటు చేసుకుంది. మొత్తం ముగ్గురు వ్యక్తులు బృందంగా ఏర్పడి నల్లమల్ల అడవుల్లోకి వెళ్లారు. వీరిలో ఒకరు మాత్రమే తిరిగి వచ్చారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు మృతి చెందగా, మరోకరు అదృశ్యమయ్యారు. అడవి నుంచి ప్రాణాలతో బయటపడిన వ్యక్తి ఇచ్చిన సమాచారంలో అదృశ్యమైన వ్యక్తి కోసం అడవిలో గాలింపు చేపట్టారు.

నల్లమల అటవీ ప్రాంతంలో యాదవుల ఇలవేల్పు అయిన వేనూతల కాటంరాజు స్వామి పూర్వం తిరిగాడని, అక్కడ గుప్త నిధులు ఉన్నాయని కొందరి నమ్మకం. ఈ విషయాన్ని తెలుసుకున్న హైదరాబాద్‌కు చెందిన కట్టా శివకుమార్‌, గుంటూరు జిల్లాకు చెందిన కృష్ణనాయక్‌, హనుమంతరావు నాయక్‌ తాడివారిపల్లి నుంచి ఆ ప్రాంతానికి బయలుదేరారు. అయితే, నిధుల కోసం ఎక్కడ నుంచి తవ్వాలో అర్ధం కాక ఈనెల 12వ తేదీ రాత్రి కొండపైనే ఉన్నారు. ఇక చేసేది లేక, 13వ తేదీ ఉదయం అడవి నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. వీరి వెంట కొన్ని మజ్జిగ ప్యాకెట్లు, మూడు నీళ్ళ బాటిల్స్ మాత్ర మే తీసుకెళ్లారు. అవికాస్త అయిపోవడంతో దాహం తట్టుకోలేక శివకుమార్‌, హనుమంతరావు నాయక్‌ నడవలేక అడవిలోనే ఆగిపోయారు.

అడవిలో నుంచి కృష్ణనాయక్‌ ఒక్కడే ప్రాణాలను అరచేతిలో బయటపడ్డాడు. అయితే, శివకుమార్‌ పరిస్థితి గురించి, అతని కుటుంబసభ్యులకు చెప్పాడు. దీంతో శివకుమార్‌ భార్య నిర్మల తాడివారిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొదిలి సీఐ ఆధ్వర్యంలో రిస్క్‌ టీమ్‌ నల్లమల అటవీ ప్రాంతానికి వెళ్లింది. గురువారం శివకుమార్‌ మృతదేహాన్ని గుర్తించారు.

అసలు అడవిలో ఏం జరిగింది? నిజంగానే వారు దారి తప్పారా? శివకుమార్‌ మృతికి కారణాలేమిటి? హనుమంత నాయక్‌ ఆచూకీ లభ్యమైతే ఈ సందేహాలకు సమాధానం దొరికే అవకాశం ఉంది.

Similar News