మూడో విడత పంచాయతీ సమరానికి సర్వం సిద్ధం

Update: 2019-01-29 07:46 GMT

తెలంగాణలో మూడో దశ పంచాయతీ సమరానికి సమయం ఆసన్నమయ్యింది. ఈనెల 30న చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. 3,529 గ్రామ పంచాయతీలకు 11,667 మంది సర్పంచ్ అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.

తెలంగాణలో తొలి రెండు దశల పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించిన ఎన్నికల అధికారులు మూడో విడత పంచాయతీ సమరానికి సర్వం సిద్ధం చేశారు. మొత్తం 3529 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 11667 మంది సర్పంచ్ అభ్యర్ధులు బరిలో ఉన్నారు. 27,583 వార్డులకు జరుగుతున్న ఎన్నికల్లో 67,316 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మూడో విడతలో 577 సర్పంచ్ పదవులు 8956 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 10 గ్రామాలకు.,185 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు.

మొత్తం 12,732 పంచాయతీల్లో ఇప్పటికే రెండు విడతలకు ఎన్నికలు పూర్తయ్యాయి. మిగిలి ఉన్న 3529 పంచాయతీలు మూడో విడత పోలింగ్‌కు సిద్ధమయ్యాయి. ఇక ఈ గ్రామాల పరిధిలో మొత్తం 36,729 వార్డు సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీకాగా.. 8,956 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలి ఉన్న 27,583 వార్డులకు గానూ 67,316 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

నల్గొండ, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాలలోని మూడు పంచాయతీల పరిధిలో నిలిచిపోయిన పలు వార్డులకు కూడా ఈ నెల 30న ఎన్నికలు నిర్వహించి అదే రోజున ఫలితాలు వెల్లడించనున్నారు. దీంతో ఆ గ్రామాల పరిధిలో నిలిచిపోయిన ఉపసర్పంచి ఎన్నికకు మార్గం సుగమమం కానుంది. మొదటి, రెండో విడత ఎన్నికల్లో మంచి ఊపుతో ఉన్న గులాబీ పార్టీ మద్దతు దారులు మూడో విడతలోనూ సత్తా చాటుతామన్న ధీమాతో ఉన్నారు. అటు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ మద్దతు దారులు కూడా చివరి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.  

Similar News