విమానంలో ఓ ప్రయాణికుడికి తుమ్ములు రావడంతో ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్ అయింది. కరోనా వైరస్ ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్న వేళ, ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
కొలరాడో రాష్ట్రంలోని ఈగిల్ ఎయిర్ పోర్టు నుంచి న్యూజెర్సీకి ఓ విమానం బయలుదేరగా, ఓ ప్రయాణికుడికి తుమ్ములు వచ్చాయి. అదే ప్రయాణికుడు దగ్గుతూ ఉండటంతో మిగతా ప్రయాణికులు ఆందోళనపడ్డారు. దీంతో పైలట్ తనకు సమీపంలో ఉన్న డెన్వర్ ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారాన్ని అందించాడు. ఫ్లయిట్ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు అనుమతి కోరడంతో వారు అంగీకరించారు.
పైలట్ డెన్వర్ ఎయిర్ పోర్టులో విమానాన్ని దించగా, అప్పటికే సమాచారాన్ని అందుకున్న వైద్యులు అతన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ప్రయాణికుడికి వచ్చింది అలర్జీయేనని తేల్చారు. ఏ విధమైన కరోనా వైరస్ లక్షణాలు లేవని వారు చెప్పడంతో విమానం తిరిగి న్యూజెర్సీకి బయలుదేరింది.