Hormuz Crisis : ప్రపంచ దేశాలను అదును చూసి దెబ్బ కొట్టినఇరాన్..!

Hormuz Crisis : ప్రపంచ చమురు రవాణాలో 20% వాటా కలిగిన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీనివల్ల భారత్‌లో పెట్రోల్ ధరలు పెరగడమే కాకుండా 90 లక్షల మంది ప్రవాస భారతీయుల భద్రత ప్రమాదంలో పడింది.

Update: 2026-03-05 06:23 GMT

Hormuz Crisis : ప్రపంచ దేశాలను అదును చూసి దెబ్బ కొట్టినఇరాన్..!

Hormuz Crisis : ప్రపంచ పటంలో అది ఒక చిన్న ఇరుకైన సముద్ర మార్గం. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు. కానీ, ఆ దారి మూతపడితే ప్రపంచం అంధకారంలోకి వెళ్తుంది. అదే హార్ముజ్ జలసంధి. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది.

పర్షియా గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో కలిపే ఈ మార్గం ద్వారా ప్రతిరోజూ 20 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు రవాణా అవుతుంది. అంటే ప్రపంచ మొత్తం చమురు వినియోగంలో 20 శాతం ఇక్కడి నుంచే వెళ్లాలి. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్ వంటి దేశాల చమురు ఎగుమతులకు ఇదే ఏకైక దారి. ఇరాన్ ఈ మార్గానికి ఉత్తర దిశలో ఉండటం వల్ల, తన సైనిక బలంతో దీనిని నియంత్రించడం ఆ దేశానికి ఒక పెద్ద వ్యూహాత్మక ఆయుధంగా మారింది.

మార్చి 2న ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఈ మార్గాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా, వెళ్లే ఓడలపై దాడులు చేస్తామని హెచ్చరించింది.150కి పైగా వాణిజ్య నౌకలు నిలిచిపోయాయి. ఇప్పటికే 5 నౌకలు దెబ్బతిన్నాయి, చమురు ట్యాంకర్ల రాకపోకలు దాదాపు శూన్యమయ్యాయి.అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 13% పెరిగాయి, త్వరలోనే బ్యారెల్ ధర $100 దాటే ప్రమాదం ఉంది.

మన దేశ ఇంధన అవసరాల్లో 50 శాతం కంటే ఎక్కువ ఈ మార్గం నుంచే తీరుతాయి.పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయి.మన దేశ వ్యూహాత్మక చమురు నిల్వలు కేవలం 40-45 రోజులకు మాత్రమే సరిపోతాయి.గల్ఫ్ దేశాల్లో ఉన్న 90 లక్షల మంది భారతీయుల భద్రత మరియు వారి సంపాదన ప్రశ్నార్థకంగా మారింది.

ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే భారత్ తక్షణమే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలి. రష్యా నుండి దిగుమతులను మరింత పెంచుకోవాలి. కేవలం గల్ఫ్ దేశాలపైనే ఆధారపడకుండా ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకోవాలి.సౌర, గాలి , హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు వేగంగా అడుగులు వేయాలి.

హార్ముజ్ జలసంధి మూసివేత అనేది కేవలం ఇరాన్-అమెరికా సమస్య కాదు, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉన్న అంతర్జాతీయ సంక్షోభం. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో దౌత్యపరమైన చర్చలు జరిపి ఈ మార్గాన్ని తెరిపించడమే ఏకైక మార్గం. ఈ విషయంలో భారత్ వంటి దేశాలు నాయకత్వ బాధ్యత వహించి శాంతిని నెలకొల్పాలి.

Tags:    

Similar News