చైనా సరిహద్దు సమీపంలో 49 మంది ప్రయాణికులతో వెళ్తున్న రష్యన్ విమానం కుప్పకూలింది
చైనా సరిహద్దు సమీపంలో 49 మంది ప్రయాణికులతో వెళ్తున్న అంగారా ఎయిర్లైన్స్కు చెందిన AN-24 విమానం కుప్పకూలింది. టిండా సమీపంలో ఘటన చోటుచేసుకోగా, రెస్క్యూ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
Russian Plane Crashes Near China Border with 49 Passengers Onboard
రష్యా-చైనా సరిహద్దు సమీపంలో ఓ భారీ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అంగారా ఎయిర్లైన్స్కు చెందిన AN-24 ప్రయాణికుల విమానం తూర్పు రష్యాలోని అముర్ ప్రాంతంలో కుప్పకూలింది. విమానంలో మొత్తం 49 మంది ఉన్నారు. వీరిలో 43 మంది ప్రయాణికులు కాగా, 6 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాద సమయంలో విమానంలో ఐదుగురు చిన్నారులు కూడా ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
ఎటీసీతో సంబంధాలు తెగిపోయిన అనంతరం ప్రమాదం:
విమానానికి రష్యన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)తో సంబంధాలు అకస్మాత్తుగా తెగిపోయినట్టు అధికారులు వెల్లడించారు. సంబంధాలు తెగిన సమయంలో విమానం టిండా నగరానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఉండింది. తరువాత జరిగిన గాలింపు చర్యల్లో, అదే ప్రాంతంలో విమానం కుప్పకూలినట్టుగా గుర్తించారని రష్యన్ మీడియా నివేదికలు తెలిపాయి.
రెండు సార్లు ల్యాండింగ్ ప్రయత్నం విఫలం:
విమాన ప్రమాదానికి ముందు, పైలట్ ఇద్దసార్లు ల్యాండింగ్ ప్రయత్నించినప్పటికీ విజయవంతం కాలేదు. చివరకు విమానం అదుపుతప్పి నేల మీద కూలిపోయింది. ఘటనాస్థలిలో భారీ మంటలు చెలరేగినట్లు రెస్క్యూ బృందాలు వెల్లడించాయి. ప్రస్తుతం అగ్నిమాపక దళాలు, సహాయక బృందాలు అక్కడే ముమ్మరంగా పని చేస్తున్నాయి.
విమాన విశేషాలు:
కుప్పకూలిన విమానం Angara Airlines కు చెందిన AN-24 ప్యాసింజర్ విమానం. ఈ సంస్థ 2000వ సంవత్సరంలో స్థాపించబడింది. ఇర్కుట్స్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఎయిర్లైన్స్, సైబీరియాతో పాటు చైనా మాంఝూలీ ప్రాంతానికి కూడా సేవలు అందిస్తోంది. ఈ విమానం టిండా గమ్యస్థానంగా ప్రయాణిస్తుండగా ఈ భయానక ఘటన చోటుచేసుకుంది.
ప్రస్తుతం పరిస్థితి:
- విమానంలో ఉన్నవారి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
- రెస్క్యూ టీమ్లు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.
- ప్రమాదానికి గల అసలు కారణం ఏంటన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.