Operation Sindoor: 26 ప్రాంతాల్లో పాక్ డ్రోన్ల దాడి.. తిప్పికొట్టిన భారత సైన్యం
Operation Sindoor: 26 ప్రాంతాల్లో పాక్ డ్రోన్ల దాడి.. తిప్పికొట్టిన భారత సైన్యం
Operation Sindoor: పాకిస్తాన్ భారత్ పై డ్రోన్ల దాడిని వరుసగా రెండో రోజు కూడా కొనసాగించింది. ఉత్తరాన బారాముల్లా నుంచి దక్షిణాన భుజ్ వరకు సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి 26 ప్రాంతాల్లో డ్రోన్ల దాడికి తెగబడింది పాకిస్తాన్. పౌరులు, ఆర్మీని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ సాయుధ డ్రోన్లను ప్రయోగించింది. బారాముల్లా, శ్రీనగర్, అవంతిపొర, జమ్మూ, సాంబా, పఠాన్ కోట్ లతోపాటు అమ్రుత్ సర్, ఫిరోజ్ పుర్, హోషియార్ పుర్, గురుదాస్ పుర్ తదితర ప్రాంతాల్లో దాయాది దేశం డ్రోన్ దాడికి పాల్పడినట్లు సైన్యం తెలిపింది.
డ్రోన్ దాడులను భారత సైన్యం కూడా దీటుగా తిప్పికొట్టింది. వీటిలో కొన్ని ఆయుధాలతో కూడిన డ్రోన్లు ఉన్నాయని సైన్యం అనుమానించింది. ఫిరోజ్ పూర్ లో డ్రోన్ దాడిలో ఓ కుటుంబం గాయపడింది. భద్రతా దళాలు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని వైద్య సాయం కోసం ఆసుపత్రికి తరలించింది. భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ ద్వారా ఎప్పటికప్పుడు డ్రోన్ దాడులను తిప్పికొట్టాయి. భయపడాల్సిన అవసరం లేదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైన్యం తెలిపింది. అత్యవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని విజ్నప్తి చేసింది.