Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ పై స్పందించిన పాక్ ప్రధాని.. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిక
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ పై స్పందించిన పాక్ ప్రధాని.. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిక
Operation Sindoor: పహల్గామ్ దాడులకు ప్రతీకారంగా పాక్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మొదటిసారిగా స్పందించారు. గత రాత్రి తమ దేశంపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన..దీటుగా సమాధానం ఎలా ఇవ్వాలో తమ దేశానికి, తమ బలగాలకు తెలుసు అన్నారు. పాకిస్తాన్ సాయుధ దళాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుందన్నారు. మనం వెనక్కి తగ్గుతున్నామని భారత్ అనుకుంటుందని..కానీ ఇది ధైర్యవంతుల దేశామని వారు మరిచిపోయారని వ్యాఖ్యానించారు.
మరోవైపు ఉగ్రస్థావరాలపై భారత సైనిక చర్య నేపథ్యంలో పాకిస్తాన్ కూడా అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ను ప్రకటించింది. అన్ని ఆసుపత్రుల సిబ్బంది అత్యవసర విధుల్లో ఉండాలని ఆదేశించింది. దేశవ్యాపత్ంగా 48 గంటలపాటు గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే బుధవారం సాయంత్రానికి ప్రధాన మార్గాల్లో విమాన రాకపోకలను కూడా పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది.
ఇస్లామాబాద్, పంజాబ్ లలో విద్యాసంస్థలను మూసివేసింది. దేశవ్యాప్తంగా భద్రతా బలగాలను సిద్ధం చేసింది. ఇక భారత్ జరిపిన దాడుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారని 46 మందికి గాయాలయ్యాయని పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ డైరెక్టర్ జనరల్ తెలిపారు.