కరోనా గుట్టు విప్పడానికి స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాల్సిందే.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు డిమాండ్!
కరోనా గుట్టు రట్టు చేసేందుకు దాదాపు 100 ప్రపంచదేశాలు ఏకతాటిపైకి వచ్చాయి. మానవాళిని సంక్షోభంలోకి నెట్టేసిన కొవిడ్-19 వైరస్ ఎక్కడ పుట్టింది? జంతువుల నుంచి మనుషులకు ఎలా వ్యాపించింది ? అనే అంశాలపై స్వతంత్ర విచారణ జరగాలని అవి ప్రపంచ ఆరోగ్య సంస్థను డిమాండ్ చేస్తున్నాయి. డబ్ల్యూహెచ్వో వార్షిక సదస్సు వేదికగా ఈమేరకు ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ ముసాయిదా తీర్మానాన్ని యూరోపియన్ యూనియన్కు చెందిన 27 దేశాలు, భారత్, బంగ్లాదేశ్, టర్కీ, జపాన్, దక్షిణ కొరియా, రష్యా, కెనడా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా సహా మొత్తం 100 దేశాలు బలపరిచాయి.
మహమ్మారి కోవిడ్-19 పుట్టుక, వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన కీలక విభాగం వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 73వ వార్షిక సమావేశం జెనీవాలో ప్రారంభం అయింది. రెండు రోజుల పాటు ఈ సమావేశం కొనసాగనుంది. కరోనా సంక్షోభంపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలన్న ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ నిర్ణయానికి భారత్ సహా దాదాపు 100 దేశాలు మద్దతు తెలిపాయి. ఈ మేరకు యూరోపియన్ యూనియన్ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి మద్దతు పలికాయి.
కోవిడ్-19 విషయంలో డబ్ల్యూహెచ్ఓ స్పందనపై నిష్పాక్షిక, సమగ్ర విచారణకై తొలుత ఆస్ట్రేలియా పిలుపునివ్వగా యూరోపియన్ యూనియన్ దేశాలు ఇందుకు మద్దతు పలికాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ నాయకత్వంపై కూడా పలు తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి.
ప్రాణాంతక వైరస్ ఉద్భవించిన నాటి నుంచి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడం నియంత్రణ చర్యలకై సభ్య దేశాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడం తదితర అంశాల్లో అంతర్జాతీయ సంస్థ స్పందించిన తీరుపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా సభ్య దేశాలు కోరాయి. కరోనా సంక్షోభానికి కేంద్ర బిందువుగా భావిస్తున్న చైనాపై విచారణకు ఈ వేదికను ఉపయోగించుకోవాలని పలు దేశాలు నిర్ణయించాయి.
కరోనా సంక్షోభంపై స్వతంత్ర్య దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న ఆస్ట్రేలియాపై చైనా కక్ష సాధింపుకు దిగింది. చైనా ఉత్పత్తుల బహిష్కరణకు పిలుపునిస్తామన్న ఆస్ట్రేలియాకు ఘాటుగానే జవాబిచ్చింది. ఆస్ట్రేలియాలోని నాలుగు ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి మాంసం దిగుమతులను తాత్కాలికంగా నిషేధించింది.