అమెరికా డ్రోన్ దాడుల్లో ఇరాన్ జనరల్ ఖాసీం సులేమాని మృతి.. ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరిక
గల్ఫ్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్ సైన్యానికి చెందిన టాప్ కమాండర్ ఖాసిం సులేమానీని అమెరికా హతమార్చింది. శుక్రవారం ఉదయం ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని విమానాశ్రయం నుంచి బయలుదేరిన సులేమానీ కాన్వాయ్పై అమెరికా డ్రోన్ల ద్వారా బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో సులేమానీతోపాటు ఓ ఇరాక్ సైనిక ఉన్నతాధికారి, పలువురు స్థానిక మిలిటెంట్లు హతమైనట్టు అమెరికా ప్రకటించింది. తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశం మేరకే ఈ సైనిక చర్య జరిపామని పెంటగాన్ తెలిపింది.
దీంతో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. వేల మంది అమెరికన్లను పొట్టనబెట్టుకున్న సులేమానీని ఎప్పుడో చంపాల్సిందని ట్రంప్ వ్యాఖ్యానించగా తీవ్రమైన ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు సులేమానీ హత్య మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమోనని ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు 4% పెరుగడంతో సంక్షోభం తప్పదని భయపడుతున్నాయి.
తమ సైన్యానికి చెందిన అగ్రశ్రేణి కమాండర్ ఖాసిం సులేమానీని హతమార్చడంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. సులేమానీ హత్యకు తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. రాబోయే పరిణామాలకు ఆ దేశమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. బాగ్దాద్లో అమెరికా దళాలు జరిపిన దాడిలో తమ కుడ్స్ఫోర్స్ కమాండర్ సులేమానీ ప్రాణాలు కోల్పోయారని ఐఆర్జీసీ ధ్రువీకరించింది. రెండు వాహనాలపై అమెరికా దళాలు క్షిపణులతో దాడిచేశాయని, ఈ ఘటనలో సులేమానీ సహా 10 మంది అమరులయ్యారని ఇరాక్లోని ఇరాన్ రాయబారి ఇరాజ్ మజేదీ వెల్లడించారు.