బహ్రెయిన్లో ఘోర అగ్ని ప్రమాదం..25 మంది తెలుగువారు మృతి చెందారని వార్తలు
గల్ఫ్ దేశం బహ్రేయిన్లో ఘోర ప్రమాదం సంభవించింది. అక్కడి ఓ ఫ్యాక్టీరీ అగ్నికీలల్లో చిక్కుకుంది. భారీగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఫ్యాక్టరీ పూర్తిగా ఆహుతైంది. సుమారు వంద మందికి పైగా కార్మికులు సజీవదహనం అయ్యారు. మృతులంతా ఆ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులుగానే చెబుతున్నారు. మృతుల్లో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీ ఆవరణలో గుట్టల్లా పడి ఉన్న మృతదేహాలు అగ్నిప్రమాద తీవ్రతను చెబుతున్నాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు మంటలకు ఆహుతయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.
పేలుడు కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు గుర్తించిన ఫ్యాక్టరీ యాజమాన్యం ఫైర్ స్టేషన్కు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పదుల సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు మోహరించాయి. అయితే పరిస్థితి చూస్తుంటే ఇప్పుడప్పుడే మంటలు అదుపులోకి వచ్చే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. ఫ్యాక్టరీ విశాలంగా ఉండటంతో అగ్నిప్రమాదం భారీగా కనిపిస్తోంది. ఈ ప్రమాదంతో ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతంలో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఇటు ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన సుమారు 25 మంది వరకు కార్మికులు ఉంటారని తెలుస్తోంది. దీంతో ఆ దేశంలో ఉన్న కార్మికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమవారి పరిస్థితి ఎలా ఉందో అని కంగారు పడుతున్నారు. తమవారిని సంప్రదించి వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు.