లండన్ లో స్థిరపడిన తెలంగాణకు చెందిన డాక్టర్ దంపతులు కరోనా మహమ్మారిని జయించారు. ఈ డాక్టర్ దంపతలిద్దరికీ కరోనా సోకింది. అయినప్పటికీ వారు దాన్ని ఎంతో ధైర్యంగా ఎదురుకున్నారు. ఆత్మవిశ్వాసంతో సెల్ఫ్ ఐసోలేషన్తోనే చికిత్స తీసుకుంటూ వైరస్ నుంచి తప్పించుకోగలిగారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాణంపల్లికి గ్రామానికి చెందిన డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరిరావు. 25 ఏళ్ల క్రితం లండన్ వెళ్లారు. అక్కడే సైకాలజీ పూర్తి చేసి ప్రొఫెసర్గా చేస్తున్నారు. కుటుంబంతో న్యూబరీ నగరంలో స్థిరపడ్డారు. 6 వారాల కిందట ఆయన భార్య హేమకు కరోనా పాజిటివ్ వచ్చింది. లండన్ డాక్టర్లు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. ఇంట్లోనే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించారు.
ఐతే ఆమెకు డయాబెటిస్తోపాటూ హైపర్ టెన్షన్ కూడా ఉండటంతో ఆమెను ప్రత్యేక గదిలో ఉంచిన డాక్టర్ శేషగిరిరావు తమ పిల్లల్ని వేరే గదిలో ఉంచారు. భార్యకు సేవలు చేస్తుండగా ఆయనకు కూడా కరోనా సోకింది. ఇలా దంపతులు ఇద్దరూ కరోనా బారిన పడి ఇంట్లోనే ట్రీట్మెంట్ పొందాల్సి వచ్చింది. ఒకవైపు భార్య హేమకు చికిత్స అందిస్తూనే, మరోవైపు తనకు తాను చికిత్స చేసుకొన్నారు. పిల్లలను ఒక గదిలో ఉంచి, వీరిద్దరు మరో గదిలో ఉండేలా ప్రణాళిక చేసుకొన్నారు. 14 రోజులపాటు ఇల్లు దాటి బయట అడుగు కూడా పెట్టకుండా సెల్ఫ్ ఐసొలేషన్ పాటించారు. ఇంట్లోని పల్స్ ఆక్సిమీటర్తో రక్తంలో ఆక్సిజన్ శాతం తెలుసుకొంటూ జాగ్రత్తలు తీసుకొన్నారు. వ్యాధి నిరోధకశక్తిని పెంచుకొనేందుకు నిత్యం పసుపు, అల్లం, ఉప్పు, మిరియాలు వంటి వాటితో గృహవైద్యాన్ని తీసుకొన్నారు. ఆందోళనను బయటకు కనిపించకుండా ఆత్మవిశ్వాసంతో సెల్ఫ్ ఐసోలేషన్ పూర్తిచేసి తిరిగి ఆరోగ్యవంతులయ్యారు.ఈ విషయాన్నిడాక్టర్ శేషగిరిరావు బంధువులు వెల్లడించారు.