కరోనా వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో అంతకంటే వేగంగా సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ తప్పుడు వార్తలను నమ్మినవారు చాలా నష్టపోతున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ సోషల్ మీడియా యాజమాన్యాలు కఠినంగా వ్యవహరించకపోవడంతో ఆ తప్పుడు వార్తలకు బ్రేక్ పడటం లేదు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కు సంబంధించి తప్పుడు సమాచారం వ్యాప్తించకుండా ఆపేందుకు వాట్సాప్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
రూమర్స్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఫార్వార్డ్ మెసేజ్ లను ఒకేసారి ఎక్కువ మందికి పంపే వీలు లేకుండా కోత విధించింది. ఒకసారి ఒకే వ్యక్తికి మాత్రమే ఫార్వర్డ్ మెసేజ్ ను పంపేలా మార్పులు చేసింది. ఇప్పటి వరకూ ఇలాంటి మెసేజ్లను ఒకేసారి ఐదుగురికి షేర్ చేయగలిగే వీలు ఉంది. తాజా చర్యతో యూజర్లు వాట్సాప్లో మెసేజ్లను ఫార్వర్డ్ చేయడం 25 శాతం మేరకు తగ్గుతుందని ఆ సంస్థ వివరించింది. ఈ కొత్త నిబంధనను మంగళవారం (ఏప్రిల్ 7) నుంచే అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.