ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గురించే చర్చ జరుగుతోంది. ఈ భయంకర వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తుంది. కరోనా వైరస్తో తీవ్ర సంక్షోభంలో ఉన్న చైనాకి ఆదుకునేందుకు భారత్ కూడా ముందుకు వచ్చింది. ఈ వైరస్ని అణిచేందుకు శాస్త్రవేత్తలు, వైద్యులు ఎంతగానో కృషి చేస్తున్నారు. తాజాగా చైనా ప్రముఖ నటుడు జాకీ చాన్ సైతం కరోనా వైరస్పై స్పందించారు.
ఇప్పటికే పెద్ద మొత్తంలో మాస్క్లు, ఇతర సామాగ్రిని విరాళం ఇచ్చిన ఆయన మరో కీలక ప్రకటన చేశారు. కరోనాకు మందు కనిపెట్టిన వారికి రూ.కోటి రివార్డ్ ఇస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా చాన్ మాట్లాడుతూ ''ఈ వైరస్ను అంతమొందించాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీతోనే సాధ్యం. నాలాగే చాలా మంది ఆలోచిస్తున్నారని అనుకుంటున్నాను. త్వరలో ఈ వ్యాధిని తగ్గించేందుకు మందు కనిపెడతారని ఆశిస్తున్నాను. నాకు ఓ మంచి ఐడియా వచ్చింది. కరోనా వైరస్ను తగ్గించేందుకు ఏ వ్యక్తి మందు కనిపెట్టినా, అది ఏ సంస్థ అయినా ఫర్వాలేదు వారికి కోటి రూపాయలు ఇచ్చి ధన్యవాదాలు చెప్తాను' అని వెల్లడించారు జాకీ చాన్.