Farming: ఆకుకూరే కదా అని తీసిపారేయకండి..నెల రోజుల్లో రూ. 50,000 లాభం..!
Farming: శీతాకాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లో పచ్చని ఆకుకూరల సందడి మొదలవుతుంది.
Farming: శీతాకాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లో పచ్చని ఆకుకూరల సందడి మొదలవుతుంది. ముఖ్యంగా పాలకూర, మెంతికూరలకు ఈ సీజన్లో ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. తక్కువ పెట్టుబడి, అతి తక్కువ కాలంలోనే చేతికి వచ్చే ఆదాయం కావడంతో రైతులు ఈ సాగుపై మక్కువ చూపిస్తున్నారు. కేవలం 30 రోజుల్లోనే లక్షల లాభాలను ఆర్జించే ఈ ఆకుకూరల సాగుపై వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, లాభాల లెక్కలు ఇప్పుడు చూద్దాం.
హజారీబాగ్లోని ISECT విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ అరవింద్ కుమార్ అభిప్రాయం ప్రకారం.. ఆకుకూరల సాగుకు తేలికపాటి నేలలు, సేంద్రియ సారం అధికంగా ఉన్న భూములు అత్యంత అనుకూలం.పొలాన్ని బాగా దున్ని ఎకరానికి 8-10 టన్నుల పశువుల ఎరువును వేయాలి.ఎకరానికి పాలకూర అయితే 8-10 కిలోలు, మెంతి అయితే 6-8 కిలోల విత్తనాలు అవసరం.విత్తే ముందు విత్తనాలను తడి గుడ్డలో నానబెడితే అంకురోత్పత్తి వేగంగా జరిగి, మొక్కలు ఏకరీతిగా పెరుగుతాయి.
ఆకుకూరలకు తేమ చాలా అవసరం. శీతాకాలంలో ప్రతి 7 నుండి 10 రోజులకు ఒకసారి తేలికపాటి తడి ఇవ్వాలి. అయితే పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి, లేదంటే వేరు కుళ్లు తెగులు సోకే ప్రమాదం ఉంది. అప్పుడప్పుడు కనిపించే ఆకుమచ్చ తెగులు, పేనుబంక నివారణకు వేప ద్రావణం వంటి బయోపెస్టిసైడ్లు వాడటం శ్రేయస్కరం. పాలకూర విత్తిన 25-30 రోజుల్లో మొదటి కోతకు వస్తుంది.మెంతికూర 30-35 రోజుల్లో కోతకు సిద్ధమవుతుంది. ఒకసారి విత్తితే దాదాపు 3 నుండి 4 సార్లు కోత కోయవచ్చు, ఇది రైతులకు నిరంతర ఆదాయాన్ని ఇస్తుంది.
లాభాల లెక్క చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఒక ఎకరం సాగుకు విత్తనాలు, ఎరువులు, కూలీలు కలిపి గరిష్టంగా రూ.8,000 నుండి రూ.10,000 మాత్రమే ఖర్చవుతుంది. కానీ పంట అమ్మకం ద్వారా రూ.40,000 నుండి రూ.60,000 వరకు ఆదాయం లభిస్తుంది. అంటే నెల రోజుల్లోనే అన్ని ఖర్చులు పోను రూ.40,000 నుండి రూ.50,000 వరకు నికర లాభం సంపాదించవచ్చు. సాంప్రదాయ పంటల కంటే ఇలాంటి స్వల్పకాలిక పంటల వైపు రైతులు మొగ్గు చూపితే, శ్రమ తక్కువతో ఆర్థికంగా త్వరగా స్థిరపడవచ్చు.