హిట్తో బొద్దింకల్ని చంపొచ్చు. కానీ భర్తనే కడతేర్చింది ఓ కసాయి భార్య. నిత్యం వేధిపులకు గురిచేస్తున్నాడన్న కోపంతో... మైకంలో ఉన్న భర్త నోట్లో హిట్ కొట్టింది. అంతే అపస్మారక స్థితిలోకి వెళ్లిన జగన్ చివరికి ప్రాణాలు కోల్పోయాడు. అయితే కుటుంబ కలహాలే ఇరువురి మధ్య ఘర్షణకు దారితీసిందని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు.
బానోతు జగన్, అతని భార్య దేవిక. వీళ్లిద్దరూ రెండు నెలల క్రితం గుంటూరు జిల్లా మాచర్ల నుంచి హైదరాబాద్కి వచ్చారు. స్థానిక ఫిల్మ్నగర్లోని సైదప్ప బస్తీలో ఇద్దరు పిల్లలతో నివశిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ తగాదాలు జరుగుతుండేవి. చివరికి భర్త జగన్ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు.
జీవనాధారంగా జగన్ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి విధులు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ అర్థరాత్రి ఇంట్లో నుంచి పెద్దపెద్ద శబ్దాలు వస్తున్నాయి. దీంతో ఇంటి యజమాని ఇంట్లోకి వెళ్లిచూసే సరికి అప్పటికే జగన్ ప్రాణాలు కోల్పాయాడు. అదే సమయంలో భార్య దేవిక ఏడుస్తూ కనిపించడంతో ఇంటి యజమాని ఆరా తీశాడు. అయితే దేవిక పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులను సమాచారం అందించాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్య దేవికను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాగిన మైకంలో ఉన్న భర్త నోట్లో బొద్దింకలకు వాడే హిట్ కొట్టిందని, ఊపిరి అడక జగన్ చనిపోయాడని దేవిక విచారణలో ఒప్పుకున్నట్టు పోలీసుల తెలిపారు.
ఇదిలా ఉంటే ఇరువురి మధ్య తరచూ తగాదాలు జరుగుతుండేవని, తాగుడుకి బానిసైన జగన్ రోజూ భార్యను కొడుతుంటేవాడని, సోమవారం రాత్రి భార్య దేవికతో గొడవ పెట్టుకున్నాడని పోలీసులు చెప్తున్నారు. ఇదేసమయంలో దేవిక హిట్ కొట్టడంతోనే జగన్ అపస్మారక స్థితిలోకి వెళ్లి, కొద్దిసేపటికి ప్రాణాలు విడిచినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో అన్నీ కోణాల నుంచి దర్యాప్తు చేపట్టారు.