కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ కురువృద్ధుడు రాజీందర్ కుమార్ (ఆర్కే) ధావన్ (81) కన్నుమూశారు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్కే ధావన్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ కన్నుమూశారు. ధావన్ ను గత మంగళవారం ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. ఆయనకు కొన్నేళ్ళనుంచి కేన్సర్ ఉండటంతో.. రక్తంలో ఇన్ఫెక్షన్ పెరగడం, మూత్రపిండాలు దెబ్బతినడంతో ధావన్ మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా అయన దివంగత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీకి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. ఆతరువాత రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరుగా వున్నారు. 1990లో ఆయన కాంగ్రెస్ తరఫున రాజ్యసభ ఎంపీ అయ్యారు. ఆ తరువాత సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడిగా ఉన్నారు. రాజీవ్ గాంధీ హయాంలో గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రిగా చేశారు. 74 ఏళ్ల వయసులో, 2012లో పెళ్లి చేసుకున్నారు. ఆర్కే ధావన్ మృతిపట్ల పలువురు కాంగ్రెస్ నేతలు విషాదంలో మునిగిపోయారు. ఆయనకు సంతాపం తెలియజేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కూడా ధావన్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.