కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన కమిటీల్లో స్థానాలపై అలక బూనిన సీనియర్ నాయకుడు వీ హనుమంతారావు.. కాసేపటి క్రితం పార్క్ హయత్ హోటల్ లో ఉన్న గులాం నబీ ఆజాద్తో భేటీ అయ్యారు. ప్రచార కమిటీ ఛైర్మెన్ పదవి వస్తుందని ఆశించానని కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆయన వాపోయారు. ఈ సందర్భంగా వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కేసీఆర్ కోవర్టులున్నారని తనకు పదవి వస్తే కేసీఆర్ను ఓడిస్తాననే భయం కోవర్టుల్లో ఉందని వీహెచ్ వెల్లడించారు. అందుకే తనకు పదవి రాకుండా చేశారని ఆరోపించిన వీహెచ్ వారి పేర్లను డైరెక్ట్గా రాహుల్గాంధీ ముందే చెబుతానని స్పష్టం చేశారు. 1989 లో ప్రచార కమిటీ ఛైర్మెన్గా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చానన్న వీహెచ్.. ప్రస్తుతం కూడా అదే పదవి వస్తుందని ఆశించానని అన్నారు.