ఫేస్బుక్ తెచ్చిన తంటా.. ఎక్కువ లైక్ లు వచ్చాయని యువకుడిని ఏం చేశారో చూస్తే..
ఫేస్బుక్లో తన కంటే తన స్నేహితుడి ఫొటోకి ఎక్కువ లైక్, కామెంట్లు రావడంతో స్నేహితుడు అని కూడా చూడకుండా దారుణంగా చితకబాదారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరిగింది. జిల్లా కేంద్రంలోని మర్లు ప్రాంతానికి చెందిన చాణిక్య ఫొటో, స్థానిక వేపూర్గేరికి చెందిన బంటి ఫొటోను శనివారం ఫేస్బుక్లో స్నేహితులు అప్లోడ్ చేశారు. అయితే వీరిలో చాణిక్య ఫొటోకు ఎక్కువ మంది లైక్ కొట్టారు.. దాంతోపాటు ఎక్కువ కామెంట్లు పెట్టారు. దీంతో తనకంటే ఎక్కువ లైక్లు వచ్చాయని తట్టుకోలేక చాణిక్యను కొట్టాలని బంటి పథకం రచించాడు. పథకంలో భాగంగా చాణిక్య స్నేహితుడు శ్రీకాంత్చారిని వెంటబెట్టుకుని బంటి స్నేహితులు దత్తు, శ్యాం, జగదీశ్, శివ, సందీప్, శివసాయి, రోహిత్, విష్ణు, మధుచారి, నందివర్ధన్రెడ్డి కలిసి అదేరోజు రాత్రి చాణిక్య ఇంటికి వెళ్లి అతడిని బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఊరి బయటికి తీసుకువచ్చి సారీ చెప్పాలని అతని స్నేహితులు చాణిక్యను వధించడం మొదలుపెట్టారు. ఇందులో తన తప్పు ఏముంది సారీ ఎందుకు చెప్పాలని చాణిక్య ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటా పెరిగింది. సహనం కోల్పోయిన బంటి స్నేహితులు వెంట తీసుకొచ్చిన ఇనుప రాడ్లు, కట్టెలతో చాణిక్యపై దాడి చేశారు. అంతేకాకుండా బట్టలు విప్పించి తిప్పించారు. ఇంతలో శ్రీకాంత్చారి వెళ్లి చాణిక్య తల్లిదండ్రులతో పాటు ఇతర బంధువులను తీసుకురావడంతో వాళ్లు అక్కడి నుంచి పరారయ్యారు. ఇక ఈ ఘటనపై చాణిక్య తన తలిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.