హైదరాబాద్ మూసాపేట్లో... ఓ న్యూస్ ఛానల్ యాంకర్ రాధిక ఆత్మహత్య చేసుకుంది. అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసింది. హైదరాబాద్లోని మూసాపేట గూడ్స్షెడ్ రోడ్డులోని సువీలా అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఐదేళ్లుగా ఇక్కడే ఉంటున్న ఆమె ఆర్నెల్ల కిందట భర్తతో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన తండ్రి, చెల్లెలు, కుమారుడితో కలిసి ఉంటున్నారు. భర్త దూరమవ్వడంతో కొన్నాళ్లుగా తీవ్రమానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలిసింది. ఈనేపథ్యంలో ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో విధుల నుంచి ఇంటికి వచ్చిన ఆమె.. నిమిషాల వ్యవధిలోనే అపార్ట్మెంట్ ఆరో అంతస్తుపైకి పరుగున వెళ్తుండటాన్ని ఇరుగు పొరుగువారు గమనించారు. వారు పైకి చేరుకునే లోపునే ఆమె భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె వద్ద లభించిన లేఖను బట్టి మానసిక ఒత్తిడితోనే బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యకు మరేమైనా కారణాలున్నాయా అనేది తెలియాల్సి ఉందని కూకట్పల్లి ఏసీపీ భుజంగరావు ‘న్యూస్టుడే’కు తెలిపారు.