ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాల్లో ఒక సీటుకి అభ్యర్థిని ఖరారు చేశారు గులాబీబాస్. తనకు అత్యంత సన్నిహితుడు, బంధువైన జోగినపల్లి సంతోష్ రావుని పెద్దలసభకు పంపనున్నారు కేసీఆర్. సంతోష్కు రాజ్యసభ సీటు ఖరారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మిగిలినప రెండు సీట్లు ఎవరికి కేటాయించాలనే దానిపై కసరత్తు మొదలుపెట్టారు టీఆర్ఎస్ దళపతి.
రాష్ట్రంలో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, టీడీపీకి చెందిన సీఎం రమేష్ ఏప్రిల్ 2న రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మరణంతో ఆ సీటు ఖాళీ గానే ఉంది. ఖాళీ అవుతున్న మూడు సీట్లు టీఆర్ఎస్కే దక్కనుండటంతో ఎవరికి ఈ పదవులు వరిస్తాయన్నది ఆసక్తి కరంగా మారింది.
నామినేషన్లకు సమయం ఆసన్నం కావటంతో అధికార టీఆర్ఎస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరింది. గులాబీ బాస్ అభ్యర్థుల జాబితాకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలు బేరీజు వేసుకొని అభ్యర్థులను ఖరారు చేస్తారని పార్టీ సీనియర్లు అంచనా వేస్తున్నారు.
సీఎంకు అత్యంత సన్నిహితుడైన జోగినపల్లి సంతోష్ కుమార్కు రాజ్యసభ సీటు ఖరారైందని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొదటి నుంచి కేసీఆర్ వెన్నంటే ఉన్నారు సంతోష్. థర్డ్ ఫ్రంట్తో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న సీఎంకు.. సంతోష్ అవసరం చాలా ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. సంతోష్ను రాజ్యసభకు పంపి థర్డ్ ఫ్రంట్లో కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పజెప్పాలనేది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది.
యాదవ సామాజిక వర్గం నుంచి ఒకరికి అవకాశం ఇస్తామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సీటుకు చాలా మంది పేర్లు పరిశీలనకు వచ్చాయి. ఫైనల్గా కల్వకుర్తి నియోజకవర్గం నేత జైపాల్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య, గొర్రెల పెంపకం అభివృద్ధి సంస్థ చైర్మన్ రాజయ్య యాదవ్, వరంగల్కు చెందిన విద్యావేత్త సుందర్ రాజ్ యాదవ్ పేర్లు జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.
మూడో సీటు ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. మైనార్టీ, దళిత, రెడ్డి సామాజిక వర్గాల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చని పార్టీలో చర్చ జరుగుతోంది. ఎస్సీ కోటాలో మాజీ ఎంపీ మందా జగన్నాథం పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మందా జగన్నాథంతో కేసీఆర్ మాట్లాడినట్లు సమాచారం. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉమా మాధవరెడ్డి, నిరంజన్ రెడ్డి, హోం మంత్రి నాయిని నర్సింహ్మా రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కొందరు మైనార్టీ నేతలు కూడా సీటు కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఆశావహులు ఎవరికి వారు సీటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులచేత సిఫారసు చేయించుకునేందుకు గులాబీ నేతలు పోటీ పడుతున్నారు.