మినీ మేనిఫెస్టోను ప్రకటించి ప్రచార పర్వం నిర్వహిస్తున్న టీఆర్ఎస్ త్వరలోనే పూర్తిస్థాయి మేనిఫెస్టోను విడుదల చేయనుంది. దీనికి సంబంధించి మేనిఫెస్టో కమిటీ తుదికసరత్తులు చేస్తోంది. ఇవాళ డ్రాఫ్ట్ కాపీని పార్టీ అధినేత కేసీఆర్కు కమిటీ అందజేయనుంది. అన్ని వర్గాలను సంతృప్తి పరుస్తూ తీర్చిదిద్దిన మేనిఫెస్టోపై కేసీఆర్ తుదిమెరుగులు అద్దనున్నారు. ఇక మేనిఫెస్టోను విడుదల చేసేది ఎప్పుడనేది ఇవాళే ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.
గత కొన్ని రోజులుగా నిర్విరామంగా జిల్లాలు, నియోజకవర్గాల పర్యటనలో ఉన్న కేసీఆర్ ఇవాళ తన ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు. రోజుకు 4 నుంచి 6 సభల్లో పాల్గొంటున్న గులాబీ బాస్ రేపటి నుంచి మళ్లీ ప్రచార పర్వాన్ని షురూ చేయనున్నారు. ఇవాళ పార్టీ ప్రముఖులతో సమావేశమై ఎన్నికల ప్రచారం ప్రతిపక్షాలను ఎదుర్కొనే క్రమం నియోజకవర్గాల వారిగా తీరు తెన్నులపై దిశానిర్దేశం చేయనున్నారు. తర్వాత రేపు ఆరు సభల్లో ప్రసంగాలు చేయనున్నారు. తాండూరు, పరిగి, నారాయణ్పేట్, దేవరకద్ర, ఇబ్రహీంపట్నం, షాద్నగర్ సభలకు కేసీఆర్ రానున్నారు.
ఇటు గ్రేటర్ పరిధిలో రోడ్డు షోలతో కేటీఆర్ దూసుకుపోతున్నారు. ఇవాళ జూబ్లీహిల్స్, సనత్నగర్ రోడ్డు షోలలో కేటీఆర్ పాల్గొనున్నారు. ప్రజలే తమకు బాస్లని కూటమికి ఓటేస్తే అమరావతి, ఢిల్లీలో మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాల్సి వస్తుందంటూ ప్రచార పర్వాన్ని వేడెక్కిస్తున్నారు. అలాగే డిసెంబర్ 3 న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభకు కారు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై కూడా ఇవాళ కేసీఆర్.. పార్టీ ప్రముఖులతో సమావేశం కానున్నారు. ఏర్పాట్లు, జనసమీకరణ, ప్రసంగంపై చర్చించనున్నారు. దీనికి సంబంధించి కమిటీలను కూడా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.