ఆటోవాలా అత్యాశకు 11మంది బలి

Update: 2018-03-26 05:20 GMT

ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం..డబ్బు మీద అత్యాశ 11 మంది ప్రాణాలు తీసింది. వేగంగా వెళ్తున్న ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోవడంతో నిజామాబాద్ జిల్లాలో 11 మంది చనిపోయారు. ఆటో డ్రైవర్ సహా నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. పరిమితికి మంచి ప్రయాణికుల్ని ఆటోలో ఎక్కించడంతో పాటు అతి వేగమే ప్రమాదానికి కారణమని తేలింది.  

నిజామాబాద్ జిల్లా  మెండోరా దగ్గర ఈ ఘోర ప్రమాదంలో ముక్కుపచ్చలారని ఆరుగురు చిన్నారులు ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు మరో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలో ఏకంగా 15 మంది ప్రయాణీకులను ఎక్కించుకోవడం కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా వాహనాన్ని నడపడంతోనే ప్రమాదం జరిగినట్టు స్దానికులు చెబుతున్నారు. 

విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బావిలో ఉన్న 11 మృతదేహాలను వెలికి తీయించారు. మృతులంతా ముప్కాల్ , మెండోరా, సావేల్ వెంపల్లి గ్రామాలకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. ఆటో డ్రైవర్ ను  గోపి శ్రీనుగా గుర్తించిన అధికారులు ప్రమాదంలో గాయపడిన వారి నుంచి వివరాలు సేకరించారు. ముప్కాల్ నుంచి మెండోరా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు జిల్లా ఎస్పీ వెల్లడించారు.  బావికి ఫెన్సింగ్ లేకపోవడం, డ్రైవర్ వేగాన్ని నియంత్రించడంలో విఫలం కావడంతో  ప్రమాదం జరిగినట్టు తెలియజేశారు.   

అధికారుల నిర్లక్ష్యంతోనే నిత్యం ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. బస్సులు లేకపోవడంతో తప్పనిసరి పరిస్దితుల్లో ఆటోలను ఆశ‌్రయించాల్సి వస్తోందని బాధితుల బంధువులు చెబుతున్నారు. తమ బలహీనతను ఆధారం చేసుకుని ఇలా పరిమితికి మించి ప్రయాణీకులకు ఎక్కించుకుంటూ ప్రాణాల మీదకు తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

Similar News