తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకంట్ల చంద్రశేఖర్రావుకి ఆంధ్రప్రదేశ్లో అభిమానులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. సందర్భం ఏదైనాసరే కేసీఆర్పై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఫ్లెక్సీల రూపంలో తమ మనసులో ఉన్న ఇష్టాన్ని, ఆయన పరిపాలనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక యాదవులైతే కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు.
సంక్రాంతి సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్దఎత్తున జరిగిన కోడి పందాల్లోనూ కేసీఆర్ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రధాని నరేంద్రమోడీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రాలతో సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఏర్పాటు చేశారు. కేసీఆర్కు తెలంగాణలోనే కాదు... ఏపీలోనూ అభిమానులు ఉన్నారనడానికి ఈ ఫ్లెక్సీ మరోసారి నిదర్శనంగా మారింది.