పార్లమెంటులో టీడీపీ, వైసీపీ నిరసనల హోరు..

Update: 2018-12-13 13:39 GMT

ఏపీకి ప్రత్యేక హోదాకోసం టీడీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. హోదా ఇవ్వనందుకు నిరసనగా ధర్మపోరాటాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని కడిగేస్తోంది. అంతేకాదు పార్లమెంట్‌ లో టీడీపీ ఎంపీల ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఏపీ పునర్విభజన చట్టాన్ని అమలు చేయాలని.. అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంజీవని అయిన ప్రత్యేక హోదాను ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎప్పుడు వినూత్న వేషధారణతో నిరసన తెలిపే టీడీపీ ఎంపీ శివప్రసాద్‌.. ఈసారి కూడా మరో కొత్త వేషధారణతో ఆకట్టుకున్నారు. గారడి ప్రదర్శకుడి వేషధారణలో నిరసన తెలిపారు శివప్రసాద్‌. పొట్టకూటి కోసం మాయలు చేసేవాడు ఒకరైతే.. ఓట్ల కోసం, పదవులు కోసం మాయలు చేసే వాడు మోడీ అన్నారు. ఇక ఏపీకి న్యాయం చెయ్యాలని వైసీపీ రాజ్యసభ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంటు ఆవరణలో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీరికి మాజీ ఎంపీలు వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి లు కూడా తోడయ్యారు. ఏపీకి అన్యాయం జరుగుతోందని.. ఆదుకోవాలని వారు ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Similar News