ప్రేమోన్మాది వేధింపులు మరో యువతిని బలి తీసుకున్నాయి. నల్గొండ జిల్లా కొత్తపల్లికి చెందిన శ్వేత తుప్రాన్ పేటలోని నేతాజీ కాలేజీలో ఎంబీఎ చదువుతుంది. ఈమెకు భరత్ అనే యువకుడితో పరిచయం ఉంది. ప్రేమించమని శ్వేతను వేధిస్తున్నాడు. ఇటీవల శ్వేతకు మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది. గత నెల 30న మల్కాపురం శివారులోని అశోకా ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్ష రాసేందుకు శ్వేత వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న భరత్.. అశోకా ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చాడు. పరీక్ష అనంతరం బైక్ పై బలవంతంగా తీసుకెళుతున్న భరత్ తో శ్వేత గొడవపడింది. ఇద్దరీ పెనుగులాటలో శ్వేత బైక్ పై నుంచి కిందపడి తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను భరత్ చౌటుప్పల్ లోని జయలక్ష్మి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి సీరియస్ గా వుండడంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రిలో మూడు రోజుల పాటు చికిత్స పొందుతూ శ్వేత మృతి చెందింది. తమ కూతురి చావుకు భరత్ కారణమని శ్వేత తండ్రి చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భరత్ పై కిడ్నాప్, హత్యాయత్నం కేసులను పోలీసులు నమోదు చేశారు. నిందితుడిని గాలించి అదుపులోకి తీసుకున్నారు.