నీలం రంగు చుడిదార్తో ముఖానికి ముసుగు వేసుకుని ఓ అమ్మాయి పోలీసులపైకి రాళ్లు విసిరింది. కశ్మీర్ లోయలో ఇలా పోలీసులపైకి రాళ్లు రువ్వడం సర్వసాధారణమే. కానీ అలా ఆందోళనకు దిగేవారంతా యువకులే ఉంటారు. కానీ ఆశ్చర్యకరంగా ఓ యువతి కూడా ఇలా రాళ్లు విసురుతూ కన్పించింది. ఇప్పుడు అదే యువతి.. రాష్ట్ర ఫుట్బాల్ జట్టుకు కెప్టెన్ అయ్యింది. దేశం గర్వపడే స్థాయికి ఎదగడమే ఇప్పుడు తన ముందున్న లక్ష్యం అని చెబుతోంది. ఆమే కశ్మీర్కు చెందిన అఫ్షాన్ ఆషిఖ్.
మంగళవారం ఢిల్లీలో హోంమంత్రి రాజ్నాథ్తో 21మంది యువ క్రీడాకారిణుల కలిసారు. వీరిలో అఫ్సాన్ ఆశిక్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. నాడు పోలీసుల మీదకు రాయి విసిరిన యువతి నేడు హోం మంత్రి పక్కన ఉందని, ఫుట్బాల్ కెప్టెన్ కూడా అయిందని నెటిజన్లు ఆశిక్పై ప్రశంసల జల్లు కురిపిస్తోన్నారు. రాజ్నాథ్ కలిసిన సందర్భంగా ఆశిక్ మాట్లాడుతూ.. ఆ రోజు జరిగిన సంఘటన నా జీవితాన్ని మార్చేసిందని, మా ఆత్మరక్షణ కోసమే అలా ప్రవర్తించాల్సి వచ్చిందన్నారు. కానీ మీడియా తానొక ఆందోళనకారిణిగా ముద్రవేసిందన్నారు. ఇక తన జీవితం పూర్తిగా మారిందని, క్రీడల్లో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు తెస్తానని ఆశిక్ వ్యాఖ్యానించారు. త్వరలోనే ఈమె జీవితంపై సినిమా కూడా రాబోతోందట. ఓ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అఫ్షాన్ జీవితాన్ని తెరకెక్కించే యోచనలో ఉన్నారట.
21ఏళ్ల అఫ్షాన్ ఈ ఏడాది ఏప్రిల్లో జాతీయ మీడియా వార్తల్లోకెక్కింది. ఆ సమయంలోకశ్మీర్ లోయలో అల్లర్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 24న అఫ్షాన్ మరికొందరు అమ్మాయిలతో కలిసి కోఠి బాగ్లో వెళ్తుండగా.. అక్కడ ఆందోళనలు చోటుచేసుకున్నాయి. వాటితో అఫ్షాన్ బృందానికి ఎలాంటి సంబంధం లేకున్నా.. పోలీసులు వారిపై భాష్పవాయువు ప్రయోగించారు. దీంతో ఎదురుతిరిగిన అఫ్షాన్ పోలీసులపైకి రాళ్లు విసిరింది. అప్పట్లో ఆమె ఫొటో వైరల్గా మారింది.
కశ్మీర్ తొలి ఫుట్బాల్ జట్టును కలిసాను. వీరు కశ్మీర్ లోయలోని యువతి యువతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కెరీర్ విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని రాజ్నాథ్ ట్వీట్ చేశారు.