అయోధ్యకు పెద్దసంఖ్యలో రామభక్తులు తరలివచ్చారు. కాసేపట్లో జరగనున్న సభ కోసం వీహెచ్పీ, శివసేన కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. సుమారు 3 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సభా ప్రాంగంణం కిక్కిరిసిపోయింది. ఇటు భద్రతా చర్యల్లో బాగంగా పెద్దఎత్తున భద్రతా బలగాలు మోహరించడంతో అయోధ్యలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 700 మంది పోలీసులు, 42 కంపెనీల పీఏసీ బలగాలు, 5 కంపెనీల ఆర్ఏఎఫ్, ఏటీఎస్ కమాండోలను, డ్రోన్లను మోహరించారు.
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఆర్డినెన్స్ తీసుకురావాలని కేంద్రాన్ని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. మందిరానికి సంబంధించి తీసుకొచ్చే ఆర్డినెన్స్కు శివసేన మద్దతిస్తుందని స్పష్టం చేశారు. రెండు రోజుల అయోధ్య పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ రామ జన్మభూమిని దర్శించుకున్నారు. భారీ సెక్యూరిటీని చూస్తే జన్మభూమి జైలును తలపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల సెంటిమెంట్తో ఆటలాడొద్దన్న ఉద్దవ్ మందిరంపై హిందులెవరూ మౌనంగా ఉండరని తేల్చిచెప్పారు. తన పర్యటనలో ఎలాంటి రహస్య ఎజెండా లేదన్న ఆయన తన మనోభావాలే హిందువుల మనోభావాలని తెలిపారు. అయోధ్య రామ మందిరం అంశం బీజేపీ ఎన్నికల అస్త్రంగా వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.